సున్నితమైన సమాచారం బయటకు వెళ్తుంది
వాలంటీర్లందనీ నేను అనడం లేదు
కొందరు తప్పు చేసినా అందరినీ మచ్చే
సమాచారం ఇచ్చే ముందు ప్రజలు ప్రశ్నించాలి
వాలంటీర్ల సమాచారం అంతా పోలీసుల వద్ద ఉండాలి
వాలంటీర్ల విషయంలో ఆడ బిడ్డలున్నవారు అప్రమత్తంగా ఉండాలి
భవిష్యత్తులో నియంత వ్యవస్థ తయారు చేయాలన్నదే జగన్ ప్లాన్
ఏలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) ‘వాలంటీర్ల (Volunteers) విషయంలో ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. వాలంటీర్లకు (Volunteers system) సమాచారం ఇచ్చే ముందు వారిని ఎందుకు తీసుకుంటున్నారో అడగండి. అవసరానికి మించి సమాచారం ఇవ్వకండి’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారు. వాలంటీర్లంతా తప్పు చేస్తున్నారు అని నేను చెప్పడం లేదన్నారు. తులసి వనంలో గంజాయి మొక్క ఒక్కటి ఉన్నా ప్రమాదం.. పది మంచి పళ్లున్న గంపలో ఒక కుళ్లిపోయిన పండు ఉంటే మొత్తం గంపను కుళ్లిపోయిన గంపగానే భావిస్తారు. అలాగే కొందరు తప్పు చేసినా వాలంటీరు వ్యవస్థనంతా అంటారని చెప్పారు.
ప్రభుత్వ శాఖల సిబ్బంది ఉండగా, జగన్ సమాంతర వ్యవస్థను నెలకొల్పాడు. ప్రజా ధనం వినియోగిస్తూ… వైసీపీకి అనుకూలంగా పనిచేయిస్తున్నాడని జనసేనాని చెప్పారు. వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం ఏలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు జన సైనికులు, వీర మహిళల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “నియంతల ఆలోచన ఉన్న జగన్ మన ఇంట్లోకి వచ్చి మనందరినీ కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. వాలంటీర్లను ప్రజలంతా ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఈ వ్యవస్థ అత్యంత ప్రమాదరకంగా మారుతుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
జగన్… నువ్వేం కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్
నేను వాలంటీర్ల మీద అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. జగన్ నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు. కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. కచ్చితంగా రాబోయే విపత్తును ముందే చెబుతున్నాను. నాకు తెలిసిన కీలకమైన సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తూనే ఉంటా. వాలంటీర్లు ప్రతి ఇల్లు తిరుగుతూ సమాచారం అడుగుతున్నారు. ప్రతి ఇంటి డేటా తీసుకుంటున్నారు. ఎంత మంది ఉంటున్నారు..? వారేం చేస్తున్నారు..? ఎప్పుడు బయటకు వెళ్తారు..? ఎలా వెళ్తారు..? వారి బంధువులు ఎవరు ఇలా అన్ని కీలకమైన వివరాలు తీసుకుంటున్నారు. మైక్రో లెవల్లో సున్నిత సమాచారం తీసుకొంటున్నారు. ఈ సమాచారం పక్కదోవ పట్టే అవకాశం ఉంది అని పవన్ వివరించారు.
గ్రామాల్లో అతి సున్నితమైన సమాచారం ఎటు వెళ్తుందో, ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు. అది ఒక్కోసారి వాలంటీర్లకు తెలియకుండా కూడా బయటకు వెళ్తుంది. వాలంటీర్లు అందరినీ నేను అనడం లేదు. తప్పు పట్టడం లేదు. వాలంటీర్ల వద్ద ఉన్న కొంత సమాచారం బయటకు వెళ్తుంది. “బాగున్నారా బ్యాచ్” అని పేరు పెట్టి, శాఖల వ్యవస్థలను నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థను ఎందుకు వైసీపీ ప్రోత్సహిస్తోంది అని జనసేనాని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఎందుకీ సమాచారం
వైసీపీ పార్టీ కోసం పని చేసే వారు అయితే సమాచారం ఎందుకు..? ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు అసలు ప్రజలు ఎందుకు వారికి సహకరించాలి..? ప్రజల ధనంతో జీతాలు ఇస్తున్నపుడు వారు ఎవరో మాకు తెలియాలి. ప్రజలకు పూర్తి వివరాలు తెలియాలి. వాలంటీర్ల సమాచారం కచ్చితంగా ప్రతి జిల్లా ఎస్పీ దగ్గర ఉండాలి. కచ్చితంగా వాలంటీర్లు ఇబ్బంది పెడితే ప్రజలకు పోలీసులు అండగా నిలబడాలి. ఈ కొత్త నియంత వ్యవస్థల్లోని లోపాలు మొదట కనిపించవు. ఒక దాని తర్వాత ఒకటి బయట పడుతుంది. అప్పటికి మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాం. నేను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. వాళ్ల పని వాళ్లు చేస్తే పర్వాలేదు. అధికార పార్టీ కోసమే వారు పనిచేస్తే మాత్రం ప్రజలు కచ్చితంగా అడగండి అని జనసేనాని సూచించారు.
జగన్ కంటే బ్రిటీషు వారు నయం
జనసేన పార్టీ ఇంత బలంగా ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్య కంటకులకు భయంగా ఉంది. వైసీపీ లాంటి పార్టీకి బైబై చెప్పాలంటే మనలో ఎంత గుండె ధైర్యం ఉందో ప్రజలకు అర్ధం అవుతుంది. జగన్ అనే వ్యక్తి బాగా పాలిస్తే, నాకంటే ఆనందించే వ్యక్తి ఉండడు. కానీ అలా జరగడం లేదన్నదే నా బాధ. ఏలూరు డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులు చెట్ల కింద చదువుతున్నారు. వారికి భవనం కట్టాలంటే బటన్లు పనిచేయవు. జగన్ పాలన కంటే బ్రిటీషు వారు కాస్త నయం. నాడు మాకొద్దీ తెల్లదొరతనం అని అప్పట్లో అన్నారంటే… ఇప్పుడు ఉంటే మాకొద్దీ నల్లదొరతనం అనేవారు. మార్పును నేను మెల్లగా తీసుకొచ్చే క్రమంలో కచ్చితంగా అద్భుతమైన కొత్త రాజకీయాన్ని తీసుకొస్తాను. విద్యార్థులకు కనీసం సరైన కళాశాల లేదంటే మనం ఎక్కడున్నాం..? ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే ఎలా..? కూపస్థ మండూకంలా ఎప్పుడూ బతకకూడదు. జగన్ కరెక్ట్ కాదా..? పవన్ కరెక్ట్ కాదా..? అనేది ప్రజలు సొంతంగా ఆలోచించండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి స్థానానికి జగన్ విలువ ఇవ్వడం లేదు. స్థాయి మరచి దిగజారి నా గురించి మాట్లాడుతుంటే నేను నువ్వు అనే అంటాను. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చావు. ఆయుధం లేకుండా చేసే యుద్ధమే ప్రజాస్వామ్యం. మధ్య యుగంలోనూ నీతి ఉండేది. ఆడవాళ్ల జోలికి, పిల్లల జోలికి వచ్చేవారు కాదు. ఛత్రపతి శివాజీ సైతం ఎప్పుడూ శత్రువుల ఇళ్లలోని ఆడవాళ్ల జోలికి వెళ్లలేదు. అది మన సంస్కృతి. జగన్ అనే వ్యక్తి ఇంట్లో కూర్చొన్న ఆడవారి మీద మాట్లాడుతుంటే ఇంకేం ఆయనకు గౌరవం ఎందుకు ఇస్తాం..?
నాయకుడి ప్రవర్తన సరళి సమాజం మీద పడుతుంది. నాయకుడే తప్పుగా మాట్లాడుతుంటే, కార్యకర్తలు ఏం చేస్తారు..? గతంలో చంద్రబాబు గారి భార్యను అంటే కచ్చితంగా మనకెందుకు అనుకోలేదు. దానిని మనం ఖండించాం. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఖండించాల్సిందే. బాపట్ల జిల్లా రెడ్డివారి పల్లెలో ఓ ఆడబిడ్డను వేధించారని అడిగిన బాలుడ్ని వైసీపీ వాళ్లు పెట్రోలు పోసి కాల్చి హత్య చేశారు. నాయకుడు గతి తప్పితే… కార్యకర్తలకు మతి తప్పుతుంది అనడానికి అదే నిదర్శనం.
మార్పు కోసం ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు
మహిళలు, యువత మనకెందుకు జేజేలు పలుకుతున్నారు అంటే కచ్చితంగా మార్పు కోసం వారు వేచిచూస్తున్నారనే అర్ధం. మార్పు కోసం వేచి చూస్తున్న ఎడారి బతుకులకు ఒయాసిస్ కనపడితే ఎంత ఆనందంగా ఉంటుందో వారి కళ్లలో అది కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద మాట్లాడండి. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడండి. దేశం, సమాజం మీద ఎంత ప్రేమ లేకపోతే నేను ఇలా ఉంటాను. నిరంతరం ఒత్తిడి తీసుకుంటున్నానంటే కేవలం సమాజానికి ఏదో చేయాలని కోరిక. శ్రీ పొట్టి శ్రీరాములు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి గొప్ప వ్యక్తుల త్యాగాలను మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. దాన్ని ఎక్కడా గౌరవించడం లేదు.
యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు
వాలంటీరు వ్యవస్థ గురించి మాట్లాడాను అంటే వారి పొట్టకొట్టాలని కాదు.. నాకు ఆ ఉద్దేశం లేదు. కేవలం యువతలోని శక్తికి రూ.5 వేల పెట్టి జీవితాలు ఛిద్రం చేస్తున్నారు. సాక్షి పత్రిక కోసం మళ్లీ దానికి రూ.200 ఇస్తున్నారు. యువత శక్తిని అక్కడ 33 వేల గ్రామాల్లో యువతను కట్టి పడేస్తున్నారు. వారిని అలా బావిలోని కప్పలా ఉంచితే యువతలోని నైపుణ్యం ఎలా బయటపడుతుంది. రూ.5 వేలకు ఊడిగం చేయాలా..? జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులు కూడా రావడం లేదు. నిరుద్యోగం ఎంత పెరిగితే యువత కేవలం ఆ ఉద్యోగాల కోసం పోటి పడుతున్నారో అర్ధం అవుతోంది అని పవన్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు.
జనసేన అనేది ఓ కుటుంబం
జనసేన పార్టీ కాదు.. కుటుంబం. మన కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటాం. కుటుంబం అనుకున్నాం కాబట్టే కార్యకర్తలకు బీమా కల్పించి అండగా ఉన్నాం. ఒక పార్టీ నిర్మాణం అంటే సాధారణ విషయం కాదు. చాలా కష్టం సాధ్యం. మన ఎంత దేశానికి నిలబడగలం అన్న సమూహాన్ని ఒక దగ్గరకు చేర్చడానికి జనసేన వేదిక అయింది. దశాబ్ధకాలంలో జనసేన పార్టీ ఎందుకు ఇంత బలంగా నిలబడిందంటే ఇదో సిద్ధాంత భావజాలం కలిగిన సమూహం.
జగన్ ఈ రాష్ట్రానికి సరికాదని అప్పుడే చెప్పాను
రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారు. దానిలో కేవలం 16 వేల మంది ఆచూకీ లభ్యం అయిందని, మిగిలిన వారు ఏమయ్యారో కూడా తెలియదని పోలీసులే చెబుతున్నారు. ఎన్ సీ ఆర్ బీ లెక్కలు అవే చెబుతున్నాయి. ఇది తీవ్రమైన సమస్య. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాతో చెప్పిన మాటలు నివ్వెరపరిచాయి. దీని వెనుక ఉన్న కారణాలను వారితో చర్చించిన అంశాలను ప్రజల ముందు పెట్టాను. రాజకీయాలకు అతీతంగా మహిళల అదృశ్యం విషయం మీద దృష్టి పెట్టాలి. వారిని ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా అనేది కచ్చితంగా బయటకు తీసుకొద్దాం.
రాష్ట్రంలో ఇంత మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే సీఎం కనీసం మాట్లాడలేదు. సమీక్ష చేయలేదు. కడప జిల్లాలో ఓ దళిత ఆడబిడ్డను రోజులపాటు పది మంది యువకులు అత్యాచారం చేశారు. పోలీసులు కేసు తీసుకోలేదు. వాలంటీర్లు పట్టించుకోలేదు. చాలా రోజుల పాటు పోరాడితే కాని కేసు తీసుకోలేదు. నేను గత ఎన్నికల్లోనే జగన్ ఈ రాష్ట్రానికి సరికాదు అని చెప్తాను. మీరంతా గత ఎన్నికల్లో వంత పాడారు. రుషికొండను కొల్లగొట్టారు. వనరుల్ని దోచేశారు. సరస్వతి నిలయం అయిన పులివెందులలో జనసేన ప్రభుత్వం రాగానే మళ్లీ తల్లి సరస్వతి విగ్రహం ప్రతిష్ఠించి జగన్ కు మంచి విద్యాబుద్ధి చెబుదాం” అని జనసేనాని పవన్అ కళ్యాణ్ అన్నారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి : నాదెండ్ల మనోహర్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటే జనసైనికులు, వీరమహిళలు క్షేత్రస్థాయిలో కష్టించి పనిచేయాలి. గ్రామాల్లో ఓట్ల నమోదు దగ్గర నుంచి పరిశీలన వరకు జాగ్రత్తగా చేపట్టాలి. దొంగ ఓట్లు నమోదైతే దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలి. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలు చూసి అనేక మంది యువత ఆకర్షితులవుతున్నారు. వారందరినీ పార్టీలోకి తీసుకొచ్చే విధంగా జనసైనికులు, వీరమహిళలు వారధిలా మారాలి.
సంక్షేమం ముసుగులో వైసీపీ దుర్మార్గ పాలన చేస్తోంది. దానిని మనందరం కలసికట్టుగా తిప్పికొట్టాలి. “హాలో ఏపీ… బై బై వైసీపీ” అన్న నినాదాన్ని నిజం చేయాలంటే మనందరం క్షేత్రస్థాయిలో పార్టీ కోసం సమయం వెచ్చించి అండగా నిలబడాలి. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని రాజకీయ క్షేత్రం నుంచి తప్పించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నిందలు వేస్తున్నారు. ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ వాళ్ల దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలి.
అక్రమ కేసులు పెడతారని భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవడం పార్టీ బాధ్యత. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని నియమించే ప్రక్రియ జరుగుతోంది. న్యాయపోరాటానికి అయ్యే ఖర్చు కూడా పార్టీయే భరిస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం. ఆ దిశగా మనందరం అంకితభావంతో పని చేద్దాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, పాల్గొన్నారు.