సామాన్య భక్తులకు ప్రాధాన్యత
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచలేదు
భక్తుల రద్దీకి అనుగుణంగా రుచికరమైన అన్నప్రసాదాలు
టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచడం లేదని ఛైర్మన్ (TTD Chairmen) వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే గారికి సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టిటిడి ఛైర్మన్ వివరించారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసమే ఈ నిర్ణయాలు తీసికున్నట్లు వైవ్ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) అన్నప్రసాద భవనం, పిఏసి – 4 (పాత అన్నప్రసాద భవనం) లోని లగేజి సెంటర్ను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ఛైర్మన్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శనం పది రోజుల క్రితం ప్రారంభించాం అని ఛైర్మెన్ అన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్ఫాహరం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వై.వి.సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
అలానే ఉత్తర భారతదేశం నుండి వచ్చే భక్తులకు భోజనంతో పాటు రొట్టెలు, చపాతీలను అందిస్తామని చైర్మెన్ చెప్పారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిపారు. స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.
ఇప్పటి వరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జిత సేవలు, దర్శనాల ధరలను టిటిడి (TTD) పెంచలేదని స్పష్టం చేసారు. పెంచే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగింది అని ఛైర్మెన్ అన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి (TTD executive Council) ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలను రద్దు చేసాము. దీని వల్ల సర్వదర్శనం టోకెన్లు పొందే సామాన్య భక్తులకు అదే రోజు దర్శనం జరుగుతోందని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మెన్ చెప్పారు.