YaddyurappaYaddyurappa

ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్‌ యడ్యూరప్ప (Yeddyurappa) తప్పుకొంటున్నారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో (Karnataka Politics) నెలకొన్న అనిష్టతకు ఎట్టకేలకు తెరపడింది. కన్నడ రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది అని తేలిపోయింది. రాజీనామా చేస్తున్నట్లు సోమవారం అప్ప స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించ నున్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన రోజే యడ్యూరప్ప రాజీనామా చేస్తుండటం గమనించవలసిన విషయం.

తీవ్ర ఆవేదనకు గురైన అప్పా

బీజేపీ ప్రభుత్వానికి (BJP Government) రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యడియూరప్ప నేడు మాట్లాడారు. ‘‘నా రాజకీయ జీవితంలో ప్రతిక్షణం అగ్నిపరీక్షే. కొవిడ్‌ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. అయినా రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపా. ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయీ (Vajpayee) కేంద్రంలో మంత్రిపదవి ఇస్తానని చెప్పారు. కానీ నేను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పా. ఈ ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా’’ అంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

రెండేళ్ల ఒప్పందంతోనే మోదీ, అమిత్ షా, నడ్డా తనకు సీఎం పదవి ఇచ్చారని, తాను బాధతో రాజీనామా చేయడం లేదని యడియూరప్ప చెప్పారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు.