రెండు ఫైళ్ల మీద సంతకాలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కి మంత్రులు, నాయకులు, అధికారుల శుభాకాంక్షలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కొణిదల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో (Deputy CM Camp office) కొణెదల పవన్ కళ్యాణ్ బుధవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకొన్నారు. అక్కడ వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో డిప్యూటీ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఆయన వెంటవచ్చారు. కార్యాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్న తీసికొన్నారు.
అనంతరం ఉదయం 10.30 నిమిషాలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. అనంతరం ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. రెండో సంతకం- గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం చేశారు. పి.ఆర్. అండ్ ఆర్.డి. ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు గారు ఆయన వెంట ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షల వెల్లువ
బాధ్యతలు తీసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ కి పౌరసరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు అందచేశారు. పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీమతి లోకం మాధవి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్దప్రసాద్, అరవ శ్రీధర్, పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, మాజీ మంత్రి, జనసేన నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల నాయకులు, శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు అందచేశారు.
ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో నిమగ్నమయ్యారు. తొలుత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలు నిర్వహించారు. అనంతరం అటవీ శాఖల సమీక్ష నిర్వహించారు.