Pawan Kalyan with J P NaddaPawan Kalyan with J P Nadda

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం
సామాజిక మార్పు కోసం 2009 నుంచి ప్రయత్నిస్తున్నాం
ఏపీ బీసీ కులాలను తెలంగాణలో తొలగించారని విన్నవించినా స్పందన లేదు
బీజేపీ-జనసేన ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరిస్తాం
ప్రపంచం మొత్తం భారత దేశ శక్తిసామర్థ్యాలు రెపరెపలాడుతున్నాయి
తెలంగాణలోనూ సమగ్ర అభివృద్ధి కావాలి
తెలంగాణ యువతకు అండగా నిలబడతానని గద్దరన్నకు మాటిచ్చా
ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పోరాడతాను
కూకట్ పల్లి ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

సమాజంలోని అణగారిన (Suppressed Classes), వెనుకబడిన వర్గాలకు (Backward  Classes) అధికారం (Political Power) దక్కిననాడే నిజమైన స్వాతంత్య్రం అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ‘సమాజంలోని అన్ని వర్గాలకీ అధికారం (Rajyadhikaram) అందాలనే బలమైన లక్ష్యంతో 2009 నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభలో పాల్గొన్నారు. కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దశాబ్ద కాలంలోనే 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తెలంగాణలోనూ భారత్ సాధిస్తున్న అభివృద్ధి జాడలు చూడాలి. ఇది కచ్చితంగా తెలంగాణకు అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యం.

జనసేన పార్టీ శ్రీరామచంద్రమూర్తిని గౌరవిస్తుంది. సకల మతాలను అంతే గౌరవంగా చూస్తుంది. సోషలిస్టు విలువలతోపాటు సమసమాజ స్థాపన ఆలోచనలు జనసేనకు ఉంటాయి. ఇలాంటి భావాలు బీజేపీలోనే కనిపిస్తాయి. భారతదేశం భద్రంగా ఉండాలని బీజేపీ భావిస్తుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే అత్యున్నత దశకు పయనిస్తోంది. జీ 20 వంటి ప్రతిష్టాత్మక సదస్సులకు భారత్ నాయకత్వం వహించడం ప్రపంచంలోని సంపన్న దేశాలకు చెందిన అధినేతలు భారత్ కు రావడం గర్వంగా అనిపించింది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇలాంటి సమగ్ర అభివృద్ధి కనిపించాలని బలంగా కోరుకుంటున్నాను అని జనసేనాని తెలిపారు.

కూకట్ పల్లి గెలుపు… ఏపీలో 25 పార్లమెంట్ సీట్లపై ప్రభావం

ప్రజా యుద్ధనౌక, నా అన్న గద్దర్ బతికి ఉన్నప్పుడు ఆయనకు ఓ మాటిచ్చాను. దశాబ్దాలపాటు గొంగడి కప్పుకుని కాలికి గజ్జెలు కట్టుకుని తెలంగాణ సాధన కోసం ఆడిపాడిన గద్దర్ తెలంగాణ కోసం, తెలంగాణ వెనుకబాటుతనం పోవాలని చివరి వరకు అనుకున్నారు. నేను ఒక సమయంలో గాయపడ్డ పాట అన్నప్పుడు ఎందుకు అలా అన్నారు అని అడిగినప్పుడు తెలంగాణ యువత, బలిదానాలు చేసిన యువత, గాయపడ్డ యువత, అలాంటి తెలంగాణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చూడలేక పోతున్నామన్న బాధ ఆయనకు చివరి వరకు ఉంది.

పోరాటాలు, బలిదానాలతో తెలంగాణ సాధించుకున్న యువతకు అండగా నిలబడు తమ్ముడా అని  గద్దర్ అడిగినప్పుడు కచ్చితంగా తెలంగాణ యువతకు అన్ని విధాలా అండగా ఉంటానని మాటిచ్చాను. దాన్ని ఎప్పటికీ తప్పను. ఇక్కడి యువత భవిష్యత్తు, వారి భద్రత నాకు ముఖ్యం. మంద కృష్ణ మాదిగ గారి పోరాటానికి ప్రధానమంత్రి మోదీ అండగా నిలిచారు. సమాజంలో అధికంగా ఉన్న వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు అధికారం అందాలి. అందరికీ సమానమైన రాజ్యాధికార ఫలాలు దక్కాలి. అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు భావిస్తాను.

2009 ఎన్నికల్లో తెలంగాణలో సైతం మనకు 18 శాతం వరకు ఓటింగ్ వచ్చింది. అలాంటి బలం మనకు ఇంకా తెలంగాణలో ఉంది. కూకట్ పల్లి నియోజకవర్గం గెలుపు, ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు సీట్లలోనూ ప్రభావితం చేస్తుంది. సభకు వచ్చిన టీడీపీ మద్దతుదారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. బీసీల నుంచి ముఖ్యమంత్రిని చూడాలని మోడీ గారి నోటి వెంట రావడం గొప్ప మార్పునకు సూచకం. తెలంగాణను బీసీలు ఏలాలి. దేశ సమగ్రత, భవిష్యత్తు కోరుకునేవాడిని. దేశానికి రెండో రాజధాని లాంటి హైదరాబాద్ లో బీజేపీ పూర్తి స్థాయిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎల్లప్పుడూ భద్రంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ఏ సమస్య వచ్చినా మీరు పిలిస్తే వస్తాను. కలసి పోరాడుదాం.

తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని నాకు ఎన్నో విజ్ఞాపనలు వచ్చాయి. దీనిపై గతంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి నివేదించాం. వారి నుంచి సరైన స్పందన లేదు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయిన వెంటనే దీనిపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని, హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని, శ్రీ నడ్డా గారిని కలసి చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. మూడు దశాబ్దాల్లో దేశం మొత్తం ఎంతో క్రమశిక్షణగా విస్తరించిన బీజేపీ మార్గదర్శకంలో జనసేన పార్టీ కూడా అంతే క్రమశిక్షణగా పార్టీ నిర్మాణం చేసుకోవాలని, కార్యకర్తలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న జనసేన పార్టీ అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే: జె.పి.నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా మాట్లాడుతూ “తెలంగాణలో పోటీలో ఉన్న బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే. తోడు దొంగలు. దీనిని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ అంటే కరప్షన్, కొలాబిరేషన్. బీ ఆర్ ఎస్ పార్టీ కుటుంబానికి మేలు చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదు. బీజేపీ నాయకత్వంలో భారత దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తగు ప్రాధాన్యత ఇచ్చాము. భారతదేశ అంతర్గత భద్రత పూర్తి స్థాయిలో మెరుగయ్యింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తోంది. ఇదే ఉత్సాహం తెలంగాణలో కూడా ఉండాలనేది బీజేపీ ఆకాంక్ష. సమాజంలో అధికంగా ఉన్న వర్గాలకు అధికారం దక్కాలి. వారికి తగిన న్యాయం జరగాలి. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులను గెలిపిస్తే కచ్చితంగా తెలంగాణ బంగారు మయం అవుతుంది. కాంగ్రెస్ చేసే వాగ్దానాలు ఏవీ నిలిచేవి కావు. బీ ఆర్ ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఉమ్మడిగా తెలంగాణను దోచుకుంటారు. బీజేపీ నాయకత్వంలో తెలంగాణ సుస్థిర అభివృద్ధి సాధ్యం. బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు సమన్వయంతో అఖండ విజయం దశగా పయనించాలి అని జె పి నడ్డా అన్నారు.

ఈ బహిరంగ సభలో జనసేన కూకట్ పల్లి అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యక్రమాల అడ్డాగా విశాఖ?