Telangana congress meetingTelangana congress meeting

తెలంగాణ కాంగ్రెస్ మోగించిన ఎన్నికల శంఖారావం
కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభ (Congress Jana garjana Sabha) భారీ విజయాన్ని సాధించింది. ఖమ్మం జనగర్జన బహిరంగసభలో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. కర్ణాటకలో వచ్చిన ఎన్నికల ఫలితాల్ని తెలంగాణలోనూ పునరావృతం చేస్తామని అలానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన కీలక సందేశాన్ని ఇచ్చారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

భారతీయ జనతా పార్టీ (భారాస), ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ మాజీ అధినేత రాహుల్‌గాంధీతో సహా ముఖ్యనేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెసులో చేరడం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది.

తెలంగాణ కాంగ్రెస్ వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌, హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ ఖమ్మం జనగర్జన సభలో మొత్తం పోడు భూములపై హక్కులు కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా గిరిజనులను ఆకట్టుకున్నది. అలానే పింఛను మొత్తాన్ని రూ.నాలుగు వేలకు పెంచుతామని ప్రకటించడం ద్వారా వృద్ధులు, వితంతువులను ఆకట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది.

కార్యకర్తలు ఇచ్చిన జెండాను రాహుల్ గాంధీ పట్టుకుని

రాహుల్‌గాంధీ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకొన్నారు. విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం వచ్చారు. ఓపెన్‌టాప్‌ జీప్‌లో హెలిప్యాడ్‌ నుంచి సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఓ కార్యకర్త పార్టీ జెండాను రాహుల్‌కు మార్గం మధ్యలో అందించగా.. రాహుల్ గాంధీ దాన్ని చేతబూని ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. భారాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగానే ఖమ్మం సభపై వక్తల ప్రసంగాలన్నీ జరిగాయి. రాహుల్‌ గాంధీ సుమారు 22 నిమిషాల పాటు ప్రసంగించారు. జాతీయ అంశాలపై భాజపాను, రాష్ట్రానికి సంబంధించి భారాసను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించారు. అన్ని రంగాల్లోనూ కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, భాజపాకు భారాస బీ టీమ్‌ అంటూ రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేసారు.

కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేతలు చేరికతో

ఖమ్మం జనగర్జన సభ ప్రారంభం కాగానే ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ స్వాగతోపన్యాసం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పాదయాత్ర పూర్తి చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సత్కరించారు. పేదలకు అండగా నిలిచారంటూ భట్టి విక్రమకను రాహుల్ ప్రశంసించారు.

ప్రజాగాయకుడు గద్దర్‌ కూడా ఖమ్మం జనగర్జనసభకు హాజరయ్యారు. గద్దర్ రాహుల్‌గాంధీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్పీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, నాయకులు బొర్ర రాజశేఖర్‌, మువ్వా విజయ్‌బాబు, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, తుళ్లూరు బ్రహ్మయ్య, స్వర్ణకుమారి, విజయాబాయి, ఆదినారాయణ, ఉన్నతవిద్యామండలి మాజీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, కోట రాంబాబు, సుజలరాణి, చంద్రశేఖర్‌, రఘునాథ్‌యాదవ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి డీవీ రావు కాంగ్రెస్‌లో చేరారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్‌…

పొంగులేటి లాంటి నాయకులూ ఓవైపు చేరారు. మరోవైపు భట్టి పాదయాత్ర ముగింపుతో జోష్ వచ్చింది. ఇంకోపక్కన ఈ సభకు అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు అయ్యారు. దీనితో ఈ సభ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. సభకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. మధ్యాహ్నం 3, 4 గంటల వరకు సభాప్రాంగణంలో స్వల్పసంఖ్యలోనే జనం కనిపించినప్పటికీ సభ ప్రారంభం అయ్యేటప్పటికి సభ కిక్కిరిసిపోయింది. అయిదు గంటల తర్వాత జనసందోహం ఒక్కసారిగా పోటెత్తింది. రాహుల్‌గాంధీ వచ్చే సమయానికి మైదానం పూర్తిగా నిండిపోయింది.

భారీ సంఖ్యలో ప్రైవేటు బస్సులను సభకు వచ్చే జనం కోసం సమకూర్చారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు డీసీఎం వాహనాలు, ఆటోల్లోనూ వచ్చారు. మధ్యాహ్నం కాలీగా ఉన్న ఖమ్మం రహదారులు సాయంత్రం నుంచి ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. మైదానం వెలుపలా జనం బారులు తీరారు. తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది అని చెప్పాలి.

భీమవరంలో వైసీపీని ఉతికి ఆరేసిన జనసేనాని పవన్ కళ్యాణ్