Pawan Kalyan in Pedana meetingPawan Kalyan in Pedana meeting

టీడీపీ అనుభవం… జనసేన పోరాట పటిమ కలిస్తే వైసీపీకి ఓటమే
నవరత్నాల హామీలన్నీ రూపాయి పావలా స్ట్రాటజీలో భాగం
పేదల సొమ్ము కొట్టేసి క్లాస్ వార్ అనడం జగన్ కే చెల్లింది
పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ఓ విపత్తు
కేంద్ర పెద్దల దగ్గరకు వెళ్లి కేసుల గురించి మాత్రమే మాట్లాడతాడు
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లు అమ్ముకుంటూ అన్యాయం చేసిన జగన్
రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని ఇంటికి పంపే సమయం వచ్చింది
జనసేన, తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ వస్తుందని ఆశిస్తున్నా
వారాహి విజయయాత్ర పెడన బహిరంగసభలో పవన్ కళ్యాణ్

జనసేన వారాహి విజయయాత్ర (Janasena Varahiyatra) పెడనలో (Pedana) జరిగిన సభలో ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) ప్రభుత్వంపై జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వం (AP Government ఇస్తున్న సంక్షేమ పథకాల్లో (Welfare schemes) ఉన్న డొల్లతనాన్ని సేనాని కడిగి పారేసారు. జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా మాయ’’ గుర్తుకొస్తుంది. నెల్లూరులో నా చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారు. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడిని. అంత పెద్ద బొమ్మలు రూపాయి పావలా అంటే ఆశ కలిగేది. ఎలాగైనా కొనాలని గోల చేస్తే అమ్మ మందలించేది. ఒకసారి ఎలాగోలా రూపాయి పావలా సంపాదించి, ఆ బొమ్మలు అమ్మే వారి దగ్గరకు వెళ్లి బొమ్మ ఇవ్వండి అంటే ఆ బొమ్మల వ్యాపారులు ఒక్కో బొమ్మకు ఒక్కో రేటు చెప్పారు. వారు వీధుల్లో గట్టిగా అరిచిన రూపాయి పావలా రేటుకు అసలు బొమ్మలే లేవు.

అందరిలో ఆశ పుట్టించి, తర్వాత ఎలాగైనా ఆ బొమ్మలు కొనుగోలు చేయించాలనేది ఆ రూపాయి పావలా వ్యాపారుల స్ట్రాటజీ. ఆంధ్రప్రదేశ్ లో అచ్చంగా జరుగుతోంది ఇదే. జగన్ అనే రూపాయి పావలా ముఖ్యమంత్రి తన రూపాయి పావలా ప్రభుత్వంలో నవరత్నాలు అనే మోసాన్ని బహిరంగంగా చేస్తూ, ప్రజల్ని ఏమారుస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో చెప్పిన నవరత్నాలన్నీ రూపాయి పావలా స్ట్రాటజీ పథకాలే అని జనం కూడా అర్ధం చేసుకున్నారు’ అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం పెడనలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘2014లో నరేంద్ర మోదీ నాయకత్వం,  చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని సంపూర్ణంగా నమ్మి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే బలమైన కాంక్షతోనే మద్దతు ఇచ్చాం. విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు బలమైన మంచి భవిష్యత్తు కావాలంటే మోదీ , చంద్రబాబు ఆలోచనలు అవసరం అని భావించాం. దశాబ్దకాలంలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన గాయం నుంచి కోలుకొని అత్యున్నతంగా ముందుకు వెళుతుందని అనుకున్నాను. అయితే అది జరగలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సమయంలో, ప్రజలంతా అభద్రతలో బతుకుతున్న రోజుల్లో కచ్చితంగా రాష్ట్రాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు అనే బలంగా నిర్ణయించుకున్నాను. 2021లో ఇచ్చిన పిలుపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పొత్తుతో రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లబోతున్నాం.

కూలీల సొమ్ము కొట్టేసి క్లాస్ వార్ అనడం జగన్ కే చెల్లింది

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కొనకళ్ల నారాయణరావు వంటి వారిపై రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో దాడి చేయడం ఆంధ్రుల మీద జరిగిన దాడిగా భావిస్తాను. రాష్ట్ర విభజన చీకటి రోజు అని ఇటీవల నూతన పార్లమెంటు భవనం ప్రారంభ సమయంలోనూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అభివర్ణించారు. ఏ పార్లమెంటు అయితే రక్షించాలో అక్కడ ఓ పార్లమెంటీరియన్ పై జరిగిన దాడి చాలా హేయమైన చర్యగా భావిస్తాను. విభిన్నమైన ఆలోచనలతో మనమంతా ఉన్నప్పటికీ ముందుగా మనం ఆంధ్రులం అనేది నిజం. మనందరి గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి. కలిసికట్టుగా సమస్యలపై పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కులభావన ఆటంకం కాకూడదు.

జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా అత్యధిక లొసుగులు ఆంధ్రప్రదేశ్ లోనే బయటపడ్డాయి. కూలీలకు సంబంధించిన డబ్బులను పక్కదారి పట్టించారు. ఇది సాక్షాత్తూ కేంద్ర మంత్రి సాథ్వీ నిరంజన్ జ్యోతి లెక్కలతో సహా పార్లమెంటులో చెప్పిన మాట. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఏడాది 1,59,570 ఫిర్యాదులు వచ్చాయి. రూ.337 కోట్ల నిధులు పక్కదారి పట్టాయి. వీటిలో విచారణ చేసి.. మళ్లీ నిధులను రికవరీ చేసింది కేవలం రూ.6.24 కోట్లు మాత్రమే. అంటే కూలీ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం కనీసం రికవరీ కూడా చేయలేకపోయింది. ఈ డబ్బు ఎవరు తినేశారు… ఎక్కడికి వెళ్లాయో కూలీలకు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ అని ఏ రీతిలో మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదు.

మాట్లాడితే దేశ ద్రోహం కేసులా..?

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా దేశద్రోహం కేసులను ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారు. ఐపీసీ సెక్షన్ 124 (ఏ) అనే దేశ ద్రోహం కేసు బ్రిటీషు కాలం నాటిదని, దానిపై న్యాయ సమీక్ష జరుగుతున్నప్పటికీ జగన్ ప్రభుత్వం దాన్ని చాలామందిపై పెట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలు పట్టించుకోకుండా ఎడాపెడా ఆ కేసులు పెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై, పాలకులను నిలదీసిన వారిపై కేసులు పెట్టింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాష్ట్రంలో చంపేసింది. కేసులు పెట్టి బెదిరించాలనేది వైసీపీ ప్లాన్. అలాంటి వాటికి జనసేన భయపడదు. హంతకులకు వంత పాడుతూ దర్జాగా గద్దెపై కూర్చున్న జగన్ కే ఏ భయం లేకుంటే, దేశభక్తిని బలంగా గుండెల్లో నింపుకున్న మాకు ఎందుకు భయాలు ఉంటాయి…? కేసులకు భయపడి మేం మీకు సలాం చేసే పరిస్థితి కలలో కూడా ఉండదు.

ఆరు లక్షల ఉద్యోగాలని కల్లబొల్లి మాటలు

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతున్నారు. వీరు చెప్పే కాకమ్మ లెక్కలు వినే పరిస్థితి యువతకు లేదు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. అక్కడ పనిచేస్తున్న సుమారు 50 వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు వింత లెక్కలు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లకు 3 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఉద్యోగాలు అనే పరిస్థితికి వైసీపీ వచ్చింది. జాబ్ క్యాలెండరు లేదు… ఏ శాఖలోనూ ప్రత్యేక నోటిఫికేషన్ లేదు. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆటంకం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఇంత మంది యువత ఆవేదనతో మా దగ్గరకు ఎందుకు వస్తారు..? వారి బాధలను ఎందుకు చెప్పుకుంటారు..?

లంచాలకు మరిగి.. ప్రజల రక్తం తాగుతున్నారు

స్థానిక ప్రజాప్రతినిధి లంచాలకు మరిగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఏ పని కావాలన్నా ప్రత్యేకంగా ధర పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. కొత్త పాస్ బుక్ కావాలంటే రూ.10 వేలు, ఆక్వా చెరువుల్లో ట్రాన్స్ ఫార్మర్ పెట్టుకోవాలంటే రూ.2 లక్షలు, ఆక్వా ఫీడ్ దుకాణం ప్రారంభించాలంటే రూ.2 నుంచి రూ.3 లక్షలు మేర వసూళ్లు చేస్తున్నారు. ఇసుక దోపిడీ, చెరువుల్లో మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. కృతివెన్ను మండలంలో సర్వే నెంబరు 94లో వేల ఎకరాల అక్రమ రొయ్యల చెరువులు తవ్వేశారు. మడ అడవులను ధ్వంసం చేసి మరీ చెరువులను ఏర్పాటు చేశారు. కోస్టల్ రెగ్యులరేటరీ జోన్ లోనూ అక్రమ చేపల చెరువులు కనిపిస్తున్నాయి. దివిసీమను తుపాన్ల నుంచి కాపాడే మడ అడవులను ధ్వంసం చేస్తే భవిష్యత్తు ఏం ఉంటుంది..? దీనిపై జనసైనికులు జాతీయ హరిత ట్రైబ్యునల్ వరకు వెళ్లి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం.

స్థానిక ప్రజా ప్రతినిధి కాన్వాయ్ వెళ్తుంటే అందరూ లేచి నిలబడి శాల్యూట్ చేయాలట. విపరీత కాలే వినాశ బుద్ధి అంటే ఇలాగే ఉంటుంది. అధికారం కోసం చేపట్టిన పాదయాత్రలో రూపాయి పావలా హామీలు ఇచ్చిన జగన్ పేదలందరికీ ఇళ్లు అంటూ చేసిన మోసం అంతా ఇంతా కాదు. జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి విడతలో 18,63,052 ఇళ్లు, రెండో విడతలో 10 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దీనికోసం రూ.43 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా హడావుడి చేశారు. బడ్జెట్లో దీనికోసం రూ.16,815 కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం, కేవలం రూ.8,258 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక ఆ నిధులను వైసీపీ నాయకులు అనేక రకాలుగా కాజేశారు. మట్టి నింపేందుకు అంటూ కొండలను కొల్లగొట్టారు. మౌలిక వసతులు అంటూ నిధులు జేబులో వేసుకున్నారు. జగనన్న ఇళ్లలో పేదలను ఆ పండగకు గృహ ప్రవేశాలు చేపిస్తాం… ఈ పండగ అంటూ చెప్పారు. పండగలు వెళ్లిపోయాయి తప్పితే… పేదలకు సొంతింటి భాగ్యం మాత్రం దక్కలేదు.

అత్యంత పిరికివాడు జగన్ రెడ్డి

రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు పార్లమెంటులో మన ఎంపీలు ప్లకార్డు పట్టుకొంటే జగన్ మాత్రం అప్పటి కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ కంట పడకుండా ఎక్కడో వెనుకాల నక్కుతూ నిలబడ్డాడు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్ర పెద్దలను కలిసి… సర్.. సర్.. మా కేసులను కాస్త చూడండి అని ప్రాధేయపడటం మాత్రమే తెలుసు. జగన్ కు నిజంగా అంతటి సత్తా ఉంటే, ధైర్యవంతుడు అయితే రైల్వే జోన్ గురించి, పోలవరం పూర్తి గురించి, స్టీల్ ప్లాంటు గురించి, రాజధాని గురించి ఎందుకు కేంద్రాన్ని అడగరు..? ప్రజల గురించి ఎందుకు మాట్లాడరు..? నాకు ఎలాంటి రాజకీయ బలం లేకున్నా నిజాయతీ అనే నైతిక బలం ఉంది. అందుకే ఎలాంటి భయం లేకుండా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంటు సమస్య గురించి మాట్లాడాను. ప్లాంటు ప్రైవేటీకరణ వద్దని కోరాను. అప్పట్లో అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగితే నిలబడలేకపోయాం. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. జగన్ ను ప్రశ్నించే వారంతా అతడికి శత్రువులే. ఎవరి మీద అయినా దేశద్రోహం కేసులు పెడతాడు.. రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకుంటాడు. మాజీ ముఖ్యమంత్రి మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిస్తాడు.

జనసైనికులపై హత్యాయత్నం కేసులు పెట్టి ఆనందిస్తాడు. రాష్ట్రానికి ఏదో మంచి చేస్తాడని ప్రజలంతా 151 అసెంబ్లీ సీట్లు, 22 మంది పార్లమెంటు సభ్యుల బలం ఇస్తే.. ఆఖరికి రాజకీయం కోసం అందరిపై కేసులు పెట్టిస్తున్నాడు. జగన్ తీరు చూస్తే 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మపై ప్రతాపం చూపిస్తున్న చందంగా ఉంది. మంచి పాలన అందించాలని జనం కోరుకుంటే జగన్ మాత్రం తనకు రాజకీయ శత్రువు ఎవరూ ఉండకూడదనేలా చూసుకుంటున్నాడు. జగనన్నే మన భవిష్యత్తు అంటూ వైసీపీ నాయకులు కొత్త కార్యక్రమం చేస్తున్నారు. జగన్ ఆంధ్రా భవిష్యత్తు కాదు.. ఆంధ్రాకు వచ్చిన విపత్తు. చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఏదో పుచ్చలపల్లి సుందరయ్య గారిలా, కార్ల్ మార్క్స్ లా, చేగువేరాలా మాటలు చెబుతాడు. పవన్ కళ్యాణ్ ను ఆర్థికంగా దెబ్బ తీయాలనే లక్ష్యంతో నా సినిమాలు వచ్చినపుడు టిక్కెట్ రేట్లను తగ్గిస్తాడు. అధికార గణాన్ని ఉపయోగించి మరీ టిక్కెట్ రేట్లు తగ్గించి ప్రజలకు మేలు చేస్తాను అంటాడు. నా పుట్టినరోజు వచ్చే సమయానికే జగన్ పర్యావరణ పరిరక్షణ గుర్తుకొచ్చి ఫ్లెక్సీలను నిషేధిస్తామని జీవోలు తెస్తాడు. నా పుట్టినరోజు అయిపోయిన వెంటనే ఆ ఫ్లెక్సీల నిషేధం గాలిలో కలిసిపోతుంది. వేలాది మంది యువత ఫ్లెక్సీల ప్రింటింగ్ పరిశ్రమలో ఉన్నారు. ఉన్నట్టుండి నిషేధం అంటే వారంతా రోడ్డున పడాలనే కనీస ఇంగితం కూడా ఉండదు.

కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకునే రకం జగన్

పవన్ కళ్యాణ్ ను తిట్టించడానికి కాపులను ఉపయోగిస్తాడు. అది కాకపోతే బీసీ నాయకులు, ఎస్సీ నాయకులతో తిట్టిస్తాడు. అంటే కాపులు, బీసీలకు గొడవ పెట్టాలనేది ప్లాన్. అలాగే దళితులు కాపులు ఘర్షణ పడాలనేది ప్లాన్. కులాలను విడదీసి రాజకీయం చేయాలని జనసేన ఎప్పుడూ అనుకోదు. మాది మానవత్వం నింపుకున్న పార్టీ. అన్నీ కులాలను సమానంగా చూసి, వారిని రాజ్యాధికారంలో భాగం చేయాలనే ఆలోచన మాది. కులాలను విడదీసి, వారి మధ్య చిచ్చు పెట్టాలనుకునే స్వభావం ఉన్న నాయకుడు జగన్. కులాల మధ్య గొడవలు జరిగితే, అభివృద్ధి గురించి అడగరు.. ఉద్యోగాల గురించి యువత అడగరు అనే ఆలోచనతోనే గొడవలు పెట్టాలని చూస్తున్నాడు. యువతకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో అభివృద్ధి సమృద్ధిగా ఉండాలి. ఇప్పటి వరకు యువతను కులాల వారీగా విడదీసి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ ది కుటుంబ పాలన. ఆయన చుట్టూ ఉన్న నాయకులు, వారి నాయకులు మాత్రం ఎవరినీ తిట్టరు. మిగిలిన కులాల వారు మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటే ఆనందిస్తారు. ఇది జగన్ కు పుట్టుకతో వచ్చిన బుద్ధి.

రాష్ట్ర ఉన్నతి కోసం రెండు పార్టీలూ కలిసి పనిచేద్దాం

ఓ ప్రజాకంటకుడు ప్రజల్ని హింసిస్తున్నపుడు, ప్రజాస్వామ్యానికి నిలువునా పాతర వేస్తున్నపుడు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో సహకారం.. సంఘర్షణ ఉంటాయి. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీలు ప్రజల కోసం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో జనసేన అండగా నిలబడింది. మేం ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. జనసేన పార్టీ పోరాట పటిమకు తెలుగుదేశం పార్టీ అనుభవ పాఠం కలగలిస్తే కచ్చితంగా జగన్ అధ:పాతాళానికి పోవడం ఖాయం. నిబద్ధతతో రెండు పార్టీలు పనిచేయాలి. ప్రజలను రక్షించేందుకు, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు వచ్చే ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం ఉంది.

జగన్ అనే వ్యక్తి మళ్లీ రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సుబ్రమణ్యస్వామి వెలిసిన పుణ్యనేల సాక్షిగా చెబుతున్నా.. జగన్ ను తీసి పక్కన పెట్టేద్దాం. 3.5 లక్షల కుటుంబాల వలసలకు కారణమైన వ్యక్తి, 60 వేల మంది పిల్లల మరణాలను పట్టించుకోని వ్యక్తిని ఇంటికి పంపించే సమయం దగ్గరకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్న వ్యక్తికి ప్రజలంతా ఓటుతో సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. జగన్ మీద 30కి పైగా కేసులున్నాయి. ఆయన రాజకీయాలకు అనర్హుడు. అన్ని కేసులు పెట్టుకొని ఆయన ఇతరుల మీద కేసులు పెడుతున్నాడు. ఆయన శ్రీ లాల్ బహుదూర్ శాస్ర్తీ, శ్రీ వాజ్ పేయ్ వంటి మహాత్ముడు ఏమీ కాదు. పెడన బహిరంగ సభలో దాడులు జరగొచ్చు అని నేను మాట్లాడితే పోలీస్ శాఖ నాకు నోటీసులు పంపించారు. సమాచారం ఇస్తే విచారణ చేస్తామని మాట్లాడారు. నాకు వచ్చిన సమాచారం నేను చెప్పాను. దానిని మీరు విచారించి నిజాలు నిగ్గు తేల్చాలి. కోనసీమలో అల్లర్లు జరుగుతాయని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చెప్పింది. అలాగే విశాఖలో పర్యటిస్తున్నప్పుడు గొడవలు సృష్టించాలని చూస్తున్నారు అని మాట్లాడాను. అవన్ని జరిగాయి. మాకు కచ్చితమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాం. పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. మీరు రాజకీయాల్లో తలదూరిస్తే ఎలా? మీ విధులు మీరు నిర్వర్తించండి. రాజకీయ పరమైన సమస్యలు మేము వైసీపీతో తేల్చుకుంటాం.

నేను ఏసీబీ కోర్టుకు వస్తానని మీకు ఎవరు చెప్పారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. నేను అదే రోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విజయవాడ వస్తుంటే హైదరాబాద్ విమానాశ్రయంలో నా విమానం టేకాఫ్ అవ్వకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గం గుండా వస్తుంటే ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ లో అడ్డుకున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం ఏసీబీ కోర్టు వద్దకు మీరు వెళ్తారనే సమాచారం ఉంది అందుకే అడ్డుకున్నాం అని పోలీసు అధికారులు సమాధానం చెప్పారు. మీకు అప్పుడు సమాచారం ఇచ్చింది ఎవరో చెబితే… పెడనలో అల్లర్లు జరగొచ్చు అని నాకు ఎవరు చెప్పారో సమాచారం ఇస్తా. బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారులు కూడా వైసీపీకి వత్తాసు పలికితే ఎలా? అసలు నేను ఎందుకు ఏసీబీ కోర్టుకు వెళ్తాను? కోర్టు విధులకు ఎందుకు ఆటంకం కలిగిస్తాను? ఎంత చెప్పినా నన్ను నా కార్యాలయానికి వెళ్లనివ్వలేదు. ఇంతటి ప్రజాదరణ ఉన్న నాలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? నేను ఏ రోజైనా రెచ్చగొట్టేలా మాట్లాడానా? శాంతిభద్రతలకు విఘాతం కలిగించానా? అలాంటి వ్యక్తినే అయితే ప్రధానమంత్రిగారు నన్ను పక్కన పెట్టుకుంటారా?

నువ్వు కాపీ కొడుతున్నప్పుడు….

కడప జిల్లా పులివెందుల చదువులకు పుట్టినిల్లు. అలాంటి ప్రాంతాన్ని గొడవలకు, గూండాయిజానికీ కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. మీ దాడులు, రౌడీయిజం సంస్కృతి తీసుకొచ్చి బెదిరించాలని చూస్తే నేను మామూలు వ్యక్తిని కాదు. చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటావు. నన్ను చూడలేదు. మీ నాన్నతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తిని నేను. ఆయన దాడి చేయించడానికి మనుషులను పంపిస్తే పార్టీ ఆఫీసులో అందరూ పారిపోయినా ఒక్కడినే కూర్చున్నాను. గుండె ధైర్యం, చెయ్యే ఆయుధంగా నిలబడ్డాను. గూండాలతో, అల్లరి మూకలతో రాళ్ల దాడి చేయిస్తే భయపడిపోతాం అనుకుంటే ఎలా? దేశభక్తులతో గొడవ పెట్టుకుంటే తిరుగుబాటు ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాం. నేను 2009లో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ రాజకీయాల్లో కూడా లేడు. ఆయన పరీక్షల్లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం గురించి ఆలోచిస్తున్నాను. ప్రాణాలకు తెగించే పార్టీ పెట్టాను. మహా అయితే ప్రాణం పోతుంది. కానీ మనం పంచిన స్ఫూర్తి నిలబడిపోతుంది.

వాలంటీర్ వ్యవస్థ మీద నేను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు నా మీద కేసులు పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం ఉంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా నేను వెనకడుగు వేయను. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప ఆడిన మాట తప్పను. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ. దాని మూలాలు నానక్ రాంగూడాలో ఉన్నాయి. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు. ఆ హక్కు వాలంటీర్లకు లేదు. ఈ మాటలకు నేను కట్టుబడే ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2021లో మాట్లాడాను. దాని కోసం కలిసి వచ్చే పార్టీలతో వెళ్తానని చెప్పాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్నా మాటకు కట్టుబడి వాళ్లతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తాన్నాము. ఇంకా ఎవరు కలిసివచ్చినా కలుపుకొని వెళ్తాం. దీనిపై బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను.

అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వొస్తోంది

అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. అడ్డగోలుగా లక్ష కోట్లు దోచేశాడని తెలిసినా ఆయనకే ఓట్లు వేశాం అంటే అవినీతిని మనం ఆమోదించినట్లే. ఇప్పుడు అవినీతి మన దినచర్యలో భాగమైపోయింది. అవినీతి ఎంత చేస్తే తక్కువ? ఎంత చేస్తే ఎక్కువ? అన్నదానిపైనే చర్చ జరగాలి. ‘ఓటుకు రూ.500 నుంచి రూ. 2000 తీసుకుంటున్న మనం అవినీతి గురించి మాట్లాడే హక్కు ఎప్పుడో కోల్పోయాం’.. ఈ మాట నేను చెప్పింది కాదు సాక్షాత్తూ జగన్ ప్రచారకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన మాట. ఓటుకు రూ. 500 తీసుకుంటే హరిశ్చంద్రుడు లాంటి నాయకులు ఎక్కడ వస్తారు అని ఆయన మాట్లాడాడు. నేను అయితే ఓట్లు కొనడానికి డబ్బులు ఇవ్వలేను. మీ భవిష్యత్తు కోసం నిలబడతాను. జనసేన పార్టీకి అధికారంలోకి రావడం అంతిమలక్ష్యం కాదు. 2047కి బలమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే లక్ష్యం.

అడ్డగోలుగా లక్షకోట్లు దోచుకున్న వ్యక్తికి ఏసీబీని శాసించే హక్కు ఎక్కడిది? అక్రమ కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే హక్కు ఎక్కడ ఉంది? ఆయన అడ్డగోలుగా దోపిడీ చేసి మనందరి మీద అవినీతి బురద జల్లుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట డబ్బులు పంచి దానిని అభివృద్ధి అంటోంది. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే కదా దాన్ని అభివృద్ధి అంటారు. రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి ఎక్కడుంది? రూ. 8,600 కోట్ల పంచాయతీల నిధులు పక్కదారి పట్టించారు. రాష్ట్రంలో ఉన్న 900 చేనేత సొసైటీలకు రూ. 120 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. కలంకారీ కార్మికులు హీన దశలో ఉన్నారు. అర్హులైన చాలామంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా పథకం అందడం లేదు. చేనేత నేస్తం పథకం కింద ఏడాదికి రూ. 24వేలు ఇస్తుంటే చేనేత కళాకారులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. సంక్షేమం కూడా సక్రమంగా అందించడం లేదు. నాకు అవినీతి చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. మీ గుండెల్లో సంపాదించిన స్థానం చాలు. నాలాంటి ఆశయ బలం ఉన్నవాడు కూడా అవినీతికి ఎక్కడో చోట అడ్డుకట్ట వేయకపోతే ఆఖరి రోజుల్లో రాష్ట్రం కోసం ఏమీ చేయలేకపోయానే అనే బాధ ఉండకూడదని పోరాటం చేస్తున్నాను.

దివిసీమ గ్రోత్ కారిడార్ పేరిట చతుర్ముఖ నగరాల అభివృద్ధి

ఒకప్పుడు విజన్ 2020 ప్రకటించినప్పుడు హైదరాబాద్, మాదాపూర్ ప్రాంతం అడువులు, రాళ్లు, రప్పలతో నిండి ఉండేది. అలాంటిది హైటెక్ సిటీతో ఇప్పుడు లక్షల కోట్ల టర్నోవర్ ప్రాంతంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు అలాంటి అభివృద్ధి కావాలి. ప్రతి ప్రాంతంలో గ్రోత్ ఇంజిన్స్ రావాలి. అమరావతి ఒక గ్రోత్ ఇంజిన్ అయితే, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రోత్ ఇంజిన్స్. విశాఖ ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్. ఈ ప్రాంతంలో దివిసీమ. దివిసీమ ఉప్పెన తర్వాత ఆ పేరులో నెగిటివిటీ కనబడుతోంది. మనం దాన్ని మార్చేద్దాం. దివిసీమ గ్రోత్ కారిడార్ పేరిట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అది చేయాలంటే యువతకు స్కిల్ డెవలప్ చేయాలి. మచిలీపట్నంలో పోర్టు అభివృద్ధి చేస్తున్నప్పుడు అందుకు సంబంధించిన స్కిల్ సెంటర్లు ఇక్కడ లేవు. ఈ ప్రాంతంలో మెరైన్ టూరిజం ఏర్పాటు చేయవచ్చు. ఎకో టూరిజం ఏర్పాటు చేయవచ్చు. కొల్లేరు, హంసలదీవి సాగర సంగమం ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చు. నాగార్జున కొండలు, ఘంటసాల బౌద్ద స్థూపాలను అభివృద్ధి చేయొచ్చు. ఐటీ కారిడార్ పెట్టొచ్చు. మీరు మా వెన్నంటి పది సంవత్సరాలు ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. నాకు మీరు అండగా నిలిస్తే అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నగరాలను చతుర్ముఖ నగరాలుగా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం.

మెడికల్ సీట్లు కూడా అమ్ముకుంటున్నారు

7 ట్రిలియన్ డాలర్ల ఎకానమి దిశగా భారతదేశం ఎదగాలని ప్రధాన మంత్రి కోరుకుంటున్నారు. అందులో సింహభాగం మనం తీసుకోవాలి. మనకు దాదాపు 900 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో సుస్థిర రాజకీయ పరిస్థితులు ఉంటే అది సాధ్యమే. దోచుకునే వాళ్లు కాకుండా దోపిడీదారులను అడ్డుకునే వారు ప్రభుత్వంలోకి రావాలి. జగన్ మాట్లాడితే అభివృద్ధి, అభివృద్ధి అని మాట్లాడుతున్నాడు. నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే కనీసవసతులు లేనివాడికి కూడా కొంత ఊరట కలిగించాలి. ఆ దిశగా జనసేన – తెలుగుదేశం పార్టీలు అడుగులు వేస్తాయి. జగన్ అవినీతి, దోపిడీ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు. మెడికల్ కాలేజీ సీట్లు కూడా అమ్మేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటే, ఇక్కడ మాత్రం అమ్ముకోవడం దురదృష్టకరం.

కలిసికట్టుగా పోరాటం చేద్దాం… వైసీపీని తరిమేద్దాం

నా తొలి ప్రాధాన్యత నా రాష్ట్రం, నా నేల, నా ప్రజలు. వాళ్ల కోసం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా.. పదేళ్లుగా నిలబడి ఉన్నాను. ఆంధ్ర అభివృద్ది చెందాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తోనే అది సాధ్యం. జనసేన- తెలుగుదేశం కూటమితో ఎవరు కలిసివచ్చినా ఆహ్వానిస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాను. వైసీపీ ఎన్ని కుట్రలు, ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన – తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకోలేదు. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీకటి రోజులు పోవాలంటే మా కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి. మనందరం సమష్టిగా పోరాడి వైసీపీ దుష్టపాలనను అంతమొందిద్దాం. ఒకరి కోసం ఒకరం నిలబడి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేద్దాం. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కలిసికట్టుగా పోరాటం చేసి విజయభేరి మోగిద్దామని” జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఐసియూలో ఉన్న వైసీపీ-అంతకంతకు ఎదుగుతున్న జనసేన!