Nadendla ManoharNadendla Manohar

ముఖ్యమంత్రి హోదాలో బెంజి సర్కిల్లో కార్యక్రమాలు చేయలేదా?
విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో

రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావిడిగా ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైసీపీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయట పెట్టుకొంది. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా సభల్లో, జనవాణి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో స్వచ్చందంగా జనం తరలి వచ్చారు. అలా వచ్చి పవన్ కళ్యాణ్’కి స్వాగతం పలకడం, ఆ తరవాత పవన్ కళ్యాణ్’ని నిర్బంధించడం అందరూ చూశారు అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

ఆ నిరంకుశత్వానికి కొనసాగింపే హోమ్ శాఖ ద్వారా ఇప్పించిన చీకటి జీవో. రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆర్టికల్ 19ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిషేధించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందా? కచ్చితంగా ఎదో రోజు జీవించే హక్కును కూడా హరిస్తారు అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఇటీవల సత్తెనపల్లిలోని జనసేన కౌలు రైతు భరోసా సభను అడ్డుకోవాలని చూడటం వాస్తవం కాదా? సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఆంక్షలు విధించి, నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్ రెడ్డి విజయవాడ బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ బళ్ళకు జెండాలు ఊపలేదా? అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా? ముఖ్యమంత్రి పర్యటన అనగానే అన్నీ మార్గాల్లో దుకాణాలు మూయించేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు పార్టీ కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారు. ఇవేవీ జనజీవనాన్ని స్తంభింపచేయడం లేదా? శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని నాదెండ్ల తెలిపారు.

ప్రతిపక్ష పార్టీ సమావేశాలకు సైతం పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర హోమ్ శాఖకు ఉంది. పోలీసులకు ముందుగానే అనుమతులకు లేఖలు ఇచ్చినా తగినంత భద్రత ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయం లేకపోతే చీకటి జీవో ఉపసంహరించుకొని ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలకు పూర్తి భద్రత ఇచ్వాలి. ప్రత్యేక సందర్భాల్లో అనుమతి ఇస్తాం అని జీవోలో చెప్పడాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రత్యేక సందర్భాలు అనేవి కేవలం వైసీపీకి మాత్రమే వస్తాయా? అనే ప్రశ్నకు జీవో ఇచ్చిన ఉన్నతాధికారి, జీవో ఇప్పించిన పాలకుడు సమాధానం ఇవ్వాలి అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్’కు మంచి విజన్ ఉన్న నేత తోట చంద్రశేఖర్