Nadendla at P GannavaramNadendla at P Gannavaram

రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన న్యాయవాది
ప్రభుత్వ అక్రమ కేసులకు జన సైనికులు భయపడొద్దు
జనసేన నాయకులు, శ్రేణులకు న్యాయపరమైన అండ
రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు గంజాయి ప్రదేశ్ చేశారు.
సులభంగా గంజాయి దొరుకుతోంది-ఉపాధి మాత్రం దొరకడం లేదు
ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ మొహం చాటేస్తున్నారు
పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాలని వైసీపీ చూసింది
కోనసీమ నుంచీ వలసలు పెరిగిపోతున్నాయి
వ్యూహంతో, ఓర్పుతో రాజకీయాలు చేద్దాం
పి. గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్

ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్ళండి… జన సైనికులు మీద ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన పార్టీ (Janasena Party) తరఫు నుంచి ఒక న్యాయవాది ఉండేలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చర్యలు తీసుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం (P Gannavaram) నియోజకవర్గ కార్యకర్తల సమావేశం అంబాజీపేటలో మంగళవారం సాయంత్రం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు.

“సామాన్యులు మా బతుకు మేం బతుకుతాం అంటే కనీస సౌకర్యాలు, సహాయం అందించని ప్రభుత్వం ఇది. ఎప్పుడు ఎవరిపై కక్ష సాధించాలా.. ఎవరి పొట్ట కొట్టాలా అన్న ఆలోచన తప్ప వేరే ఏమి చేతకాని పాలన ఇది. ఇంతకాలం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి, తమ ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మినెంట్ అవుతాయని భావిస్తున్న వాలంటీర్ల కడుపు కొట్టడానికి ఈ ప్రభుత్వం గృహ సారథులను నియమిస్తోంది. ఉత్తరాంధ్రలోనే వలసలు ఎక్కువ అనుకున్నాం. అయితే కోనసీమ నుంచీ వలసలు ఏ విధంగా ఉన్నాయో తెలిస్తే విస్తుపోతాం అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

పార్టీ క్రియాశీలక సభ్యుడు చెరుకూరి పనస రాముడు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆయన తమిళనాడుకు వలస వెళ్లి ఉపాధి కోసం పని చేస్తున్న తీరును వారి కుటుంబ సభ్యులు చెప్పడం కలిచివేసిందని నాదెండ్ల అన్నారు.

భారంగా బటన్ పాలన

బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేయను అన్నట్లు ఈ వైసీపీ ముఖ్యమంత్రి (AP CM Jagan) తీరు ఉంది. 56 బీసీ కార్పొరేషన్లకు కనీస నిధులు విడుదల చేయడం లేదు. బీసీలకు కనీసం ఒక్క రుణం కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు. బీసీల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోని ప్రభుత్వం… కేవలం ప్రకటనలు, గర్జనలు అంటూ కాలం గడిపేస్తోంది. వైసీపీ (YCP) సభలకు కళాశాలలకు, పాఠశాలలకు సెలవులు ఇచ్చి మరీ బస్సులలో జనం తరలిస్తున్నారు. మీ పాలన అద్భుతంగా ఉంటే ఇలా బలవంతంగా జనం తరలించడం ఎందుకు..? గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ముందుగానే కొన్ని ఇళ్ళను ఎంపిక చేసుకొని, వాళ్లకు తగిన తర్ఫీదు ఇచ్చి వెళ్లే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకని మనోహర్ అన్నారు?

ఆర్టీకేలు వైసీపీ కేంద్రాలు

మాండౌస్ తుపాను వస్తే రైతుల పంట నష్టం మీద కనీసం ఏ అధికారి స్పందించలేదు. అసలు పంట నష్టం ఎంత వచ్చింది..? తీసుకున్న సహాయక చర్యల గురించి చెప్పే నాథుడు లేదు. రైతు భరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వైసీపీ కేంద్రాలుగా మారిపోయాయి. జగనన్న ఇళ్లలో అంతులేని దోపిడీ చేశారు. భూముల కొనుగోలు మాయ రాత్రికి రాత్రి జరిగింది. ప్రజాధనంలోని రూ.23,500 కోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారు. ఈ అవినీతి తతంగాన్ని బయటపెట్టింది జనసేన పార్టీ మాత్రమే అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం

వైసీపీ ప్రభుత్వ పాలన తీరు మీద అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలు ఇప్పటికీ ఇప్పుడు వచ్చినా ప్రజా ఆగ్రహం ఓట్ల రూపంలో వైసీపీని తుడిచి పెట్టిస్తుంది. కచ్చితంగా వైసీపీ పాలన ముగిసిపోయే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని బెదిరింపులు చేసి గెలిచారో అందరికీ తెలుసు. జగన్ ఆలోచన విధానం ఎన్నికల ముందు ఒకలా ఇప్పుడు మరోలా ఉందని కచ్చితంగా చెప్పగలను. కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి తనకు ఓటు వేయాలని.. నేను ఉన్నాను నేను విన్నాను. అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కనీసం ఎవరి కష్టాలు కనకుండా, ప్రజల బాధలు వినకుండా తయారయ్యారు. దీనిని కచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది

వైసీపీ పాలనలో యువతను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్’ను గంజాయి ప్రదేశ్’గా చేసేశారు. సాయంత్రం ఆరు దాటితే కనీసం మహిళలు రోడ్లపైకి రాలేని పరిస్థితి ఏర్పడింది. గంజాయి మత్తులో యువత ఏం చేస్తారోనన్న భయం మహిళల్లో కనిపిస్తోంది. విచ్చలవిడిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోను గంజాయి యథేచ్ఛగా దొరుకుతోంది. వైసీపీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు గంజాయి ఎలా వస్తోంది..? యువతకు సులభంగా ఎలా దొరుకుతుంది..? అన్నది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజలు ఆలోచించాలి. గంజాయి రవాణాను నిరోధించలేక పోవడానికి అసలు కారణం ఏమిటో ప్రజలు గమనించాలని నాదెండ్ల అన్నారు.

పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాలని చూశారు

డాక్టర్ బి.ఆర్ అంటేద్కర్ లాంటి మహనీయుడి పేరు జిల్లాకు పెడతాం అంటే ఎవరు వద్దంటారు..? కచ్చితంగా అలాంటి నిర్ణయాలను జనసేన పార్టీ స్వాగతిస్తుంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం దీని వెనుక కూడా ఒక కుట్ర చేసి ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టాలని చూసింది. మహనీయుడి పేరుని సైతం తన కుటిల రాజకీయాలకు వాడుకోవాలని భావించింది. కోనసీమలో అల్లర్లు జరిగిన వెంటనే బాధ్యత గల పార్టీ అధ్యక్షునిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. తన స్వలాభం కోసం ఎలాంటి చిచ్చులు పెట్టడానికి అయినా, గొడవలు రేపడానికైనా వైసీపీ సిద్ధంగా ఉంటుంది. పేదలకు భూములు పట్టాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వ పట్టాలను చూస్తే విస్తు పోవాల్సిందే. మన భూమి పట్టా మీద సీఎం ఫోటో ఎందుకు..? ఆ పట్టాలో పూర్తిస్థాయి వివరాలు ఉండడం లేదు. కొబ్బరి రైతులను పట్టించుకోవడం లేదు. వారికి కొబ్బరి సాగు లాభసాటిగా జనసేన మారుస్తుంది. 

నియోజకవర్గ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ త్వరలోనే నిర్ణయం

నియోజకవర్గ ఇంచార్జి ఎవరో పవన్ కళ్యాణ్ చెబుతారు. నేనే నాయకుడిని.. నేనే ఇంచార్జి అనే మాటలు వద్దు. రెండు ఫ్లెక్సీలు కట్టుకుంటే, మూడు సోషల్ మీడియా పోస్టులు పెడితే నాయకులు అయిపోరు. కొందరు ఈ సీట్ నాది అంటూ కర్చీఫ్ వేస్తే పార్టీ సహించదు. పార్టీలో చేరేందుకు ఎవరు వస్తున్నా ముందు జన సైనికులతో కలిసి ప్రజల సమస్యల మీద పోరాడండి.. నిలబడండి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడాల్సిందే… గౌరవించాల్సిందే. జనసేన పార్టీ అనే వేదిక ఒకటే ఉంటుంది. ఆ వేదిక నుంచే ప్రతి ఒక్కరూ ఎలాంటి అరమరికాలు లేకుండా సమష్టిగా రాజకీయాలు చేద్దాం. ఉమ్మడిగా ముందుకు వెళ్తే పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం ఎంతో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసింది. 8 సర్పంచులు, 16 ఎంపీటీసీలు, 223 వార్డు మెంబర్లను గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. పూర్తిస్థాయి రాజకీయ ప్రయాణానికి యువత సిద్ధంగా ఉండాలి అని నాదెండ్ల తెలిపారు.

ఒక ఆలోచన విధానం, పాలనదక్షత లేని ప్రభుత్వం తీరు మీద పోరాడుదాం. ఇక్కడి రాజకీయ సామాజిక అంశాల పట్ల పవన్ కళ్యాణ్’కి స్పష్టమైన విజన్ ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళుతుంది. ఈ ప్రాంతానికి కచ్చితంగా కోకోనట్ బోర్డును తీసుకురావాలి అని గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్’ది. వచ్చే పరిశ్రమలు మన వనరుల్ని కొల్లగొట్టకుండా మనకి భవిష్యత్తు ఇచ్చేలా ఉండాలనే నినాదం జనసేన పార్టీ ది. ఒక వ్యూహం ప్రకారం, ఓపికతో రాజకీయాలు చేద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ,పితాని బాలకృష్ణ, జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్థులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పి. గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

లక్షల కోట్ల బడ్జెట్ ఏమైపోతున్నదో తెలుసా: జనసేన