CM with employeesCM with employees

2018 జూలై 1 నుంచి కొత్త వేతన సవరణ
2020 ఏప్రిల్‌ 1 నుంచి ఆర్థిక ప్రయోజనాలు
నూతన పే స్కేళ్లతోనే జనవరి జీతాలు
సీపీఎస్‌ రద్దుపై జూన్‌ 30లోగా నిర్ణయం
నేతలతో భేటీలో సీఎం జగన్‌ ప్రకటన

ఏపీ (AP) ప్రభుత్వ ఉద్యోగులకు (Government employees) వేతన సవరణ ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ (Chief Minister Jagan) ప్రకటించారు. నూతన వేతన సవరణ 2018 జూలై 1 నుంచి అమలవుతుందని సీఎం తెలిపారు. ఆర్థిక ప్రయోజనాలు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని అయన వివరించారు. జనవరి నెల నుంచే కొత్త జీతాలు అందుతాయని తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కూడా నిర్ణయించినట్లు ఏపీ సీఎం తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల ప్రతీ ఏటా రాష్ట్ర ఖజానాపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుంది అని అన్నారు. అయినప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు జగన్ తెలిపారు . తాడేపల్లి (Tadepalli) క్యాంపు కార్యాలయంలో (CM Camp Office) ముఖ్యమంత్రి శుక్రవారమిక్కడ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు.

సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10% రిజర్వ్‌ చేయడమే కాకుండా 20% రిబేటుతో ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీపై (PRC) గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన సీఎం జగన్‌.. రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పినప్పటకీ, గంటల వ్యవధిలోనే ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం సీఎస్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన ముఖ్యమంత్రి జగన్‌.. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమక్షంలోనే పీఆర్సీ ఫిట్‌మెంట్‌తో పాటు పలు సమస్యలను పరిష్కరిస్తూ జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు.

ఉద్యోగుల ఆకాంక్షలతో పాటు వాస్తవ పరిస్థితి బేరీజు

నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే (గురువారం) సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయం (శుక్రవారం) కూడా మరో విడత అధికారులతో మాట్లాడాను అని సీఎం అన్నారు.

2–3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినప్పటికీ, ఎంత వీలైతే అంత త్వరగా చెబితే మంచిదని భావించి ఈ ఉదయం సమావేశం పెట్టాను. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమైక్రాన్‌ ప్రభావం దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని నిన్ననే చెప్పాను అని జగన్ తెలిపారు.

ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం. సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యం. అది లేకపోతే సాధ్యంకాదు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన. నిన్న పీఆర్సీతో సహా కొన్ని అంశాలు మీరు లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్‌తో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాను. స్పష్టమైన టైంలైన్స్‌ పైన కూడా మాట్లాడాను అని అయన చెప్పారు.

సీఎస్‌ కమిటీ చెప్పిన దాని కన్నా 9 శాతం అదనం

సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవిక ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ.. అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించాం అని జగన్ వివరించారు.

అధికారుల కమిటీ చెప్పిన 14.29 శాతం కన్నా దాదాపు 9 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నాం. ఉద్యోగ సోదరులు సవినయంగా అర్థం చేసుకోవాలి అని సీఎం అన్నారు.

కొత్త జీతాలు ఈ నెల నుంచే..

2018 జూలై 1 నుంచి పీఆర్సీ, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌ అమలు చేస్తాం. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను అని జగన్ వివరించారు.

సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే ఈ నెల నుంచే ఆ జీతాలు ఇవ్వాలని ఆదేశించాను అని సీఎం అన్నారు.

కొత్త స్కేల్స్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 2022 జనవరి 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించాం అని జగన్ వివరించారు.

21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌

సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని చెప్పింది. అయితే మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్‌ నుంచే.. అంటే 21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇస్తాం అన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను అని జగన్ తెలిపారు.

పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని నిన్న (గురువారం) మీతో (ఉద్యోగ సంఘాలతో) చెప్పిన విధంగా.. అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని చెప్పాను సీఎం వివరించారు.

కారుణ్య ఉద్యోగాలు

కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్‌ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించాను. మీ అందరి సమక్షంలో మళ్లీ చెబుతున్నా అని అయన అన్నారు.

ఈహెచ్‌ఎస్‌– ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలని చెప్పాం. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వచ్చేలా చూస్తుంది అని జగన్ వివరించారు.

సీపీఎస్‌కు సంబంధించి కూడా టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా