Nadendla at Yuva shakthiNadendla at Yuva shakthi

యువశక్తి కార్యక్రమానికి పోలీసు అనుమతులు
మత్స్యకారులు సమస్యలు వైసీపీ ప్రభుత్వానికి పట్టదు
రణస్థలం మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్

రాష్ట్ర భవిష్యత్తు గాలికి వదిలేసి, అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.. ఈ ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంపై తిరగబడి, ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనవరి 12వ తేదీన జరగనున్న ‘యువ శక్తి’ కార్యక్రమం సభాస్థలిని శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. సభా వేదిక, సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్’తో చర్చించారు.

ఈ సందర్భంగా సభాస్థలి వద్ద నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “మన యువతరం కోసం వారి భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమం ఇది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే యువతరానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతితో పాటు ఉత్తరాంధ్ర సమస్యల మీద యువతరం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాట్లాడతారు. ఉత్తరాంధ్రలోని వెనుకబాటుతనం, వలసలు, మత్స్యకారుల సమస్యలు ఇతర అంశాల మీద 100 మంది యువతీయువకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో వారి అభిప్రాయాలను వేదిక నుంచి పంచుకుంటారు.

యువశక్తికి విశేష స్పందన

ఈ అవకాశం కోసం పార్టీ కేటాయించిన 20 ఫోన్ లైన్లలో రెండు రోజుల్లోనే సుమారు 6 వేల ఫోన్ కాల్స్, 2 వేలకు పైగా ఈమెయిల్స్ ఇప్పటి వరకు మాకు అందాయి. 8వ తేదీ తర్వాత ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ఎన్ని వచ్చాయి.. ఏమిటీ అనేది పూర్తిగా వెల్లడిస్తాం. రాష్ట్ర యువత పూర్తిస్థాయిలో ఆవేదనతో నిండి ఉన్నారు. చదువుకున్న చదువుకు సరైన ఉపాధి లేక, బతికేందుకు దారి లేక వారు యాతన అనుభవిస్తున్నారు. కష్టపడి పని చేయాలని ఆలోచన ఉన్నా, వారికి ప్రభుత్వ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. ఏదో చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచింది.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కు ఏం కావాలి… యువత లో ఎలా భరోసా నింపాలి అనే విషయాలను పవన్ కళ్యాణ్ యువశక్తి సభ ద్వారా వెల్లడిస్తారు. ఉత్తరాంధ్ర వలసలు నిరోధానికి, మత్స్యకారుల సమస్యలు పూర్తిగా తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది వివరిస్తారు. రణస్థలంలో 12వ తేదీన జరగబోయే సభ కోసం 30 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. పార్కింగ్ సదుపాయం, మరుగుదొడ్లు, భోజన ఏర్పాట్లు, లైటింగ్ ఇతరత్రా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

పోలీసులు నుంచి కూడా పూర్తిస్థాయి అనుమతులు

శ్రీకాకుళం జిల్లా పోలీసులు నుంచి కూడా పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. జనసేన పార్టీ ఎల్లప్పుడు చట్టాన్ని గౌరవిస్తుంది. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం. వారు చెప్పిన అన్ని నిబంధనలు పాటించి సభను విజయవంతం చేస్తాం. అన్ని అంశాలను పరిశీలించి సభకు అనుమతి ఇచ్చిన పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం.

కచ్చితంగా ఉత్తరాంధ్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ ఉంటుంది. కేవలం ఉత్తరాంధ్ర యువత కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి యువత ఈ సభకు తరలి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి ఒక్కరూ సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరుతున్నాను.

మత్స్యకార శాఖ మంత్రికి సవాల్

మత్స్యకారుల కోసం, కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగంగా చెప్పాలి. వైసీపీ అందిస్తున్న మత్స్యకార భరోసా సైతం అర్హులకు అందడం లేదు. రకరకాల కారణాలు చెప్పి అర్హుల పేర్లను తొలగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార మంత్రికి బహిరంగ సవాల్ చేస్తున్నాం. మత్స్యకారుల కోసం, వారి వలసల నిరోధం కోసం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసిందో చెప్పండి. మీరు దీనిపై ఎక్కడ చర్చకి రమ్మన్నా సిద్ధంగా ఉన్నాం. రూ.10 వేల జీతానికి ఎక్కడో గుజరాత్ రాష్ట్రం వెళ్లి మత్స్యకారులు పొట్ట చేత పట్టుకుని బతకాల్సిన ఆగత్యం ఎందుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల పట్ల ఏ మాత్రం చేయలేకుండా పాలన చేస్తోంది.

పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోరాట యాత్ర మొదలుపెట్టే సమయంలోనూ గంగమ్మ తల్లికి పూజలు చేసి మత్స్యకారుల దీవెనలు అందుకొని యాత్రను ప్రారంభించారు. మచ్చ కారుల సమస్యలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అది.. కచ్చితంగా జనసేన పార్టీ మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుంది” అన్నారు.

సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు కాంతిశ్రీ, పేడాడ రామ్మోహన్, గేదెల చైతన్య సందీప్ పంచకర్ల, వీఎస్ఎన్ రాజు, అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్, మూగి శ్రీనివాస్, ఎన్ని రాజు, పాత్రుని పాపారావు తదితరులు పాల్గొన్నారు.

జగనన్నా! జరా ఆలోచించండి