Anaparthi JanasenaAnaparthi Janasena

వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు అనేది ప్రచారానికే పరిమితం చేసింది. ఇది ఇలా ఉండగా పేదల గుడిసెలు పీకేయడానికి మాత్రం వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఉత్సాహం చూపిస్తోందని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఒక ప్రకటనలో దుయ్య బట్టారు. తమ పార్టీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, లే అవుట్ల కోసం అడ్డుగా ఉన్నాయని పేదల నివాసాలను ధ్వంసం చేయడం దుర్మార్గం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా (East Godavari) అనపర్తి (Anaparthi) నియోజకవర్గం బలభద్రపురంలో 40 ఏళ్లుగా గుడిసె వేసుకొనిశ్రీమతి కోటిపల్లి కామాక్షి (Kotipalli Kamakshi) నివసిస్తున్నది. కోటిపల్లి కామాక్షి కుటుంబాన్ని వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకొనేలా పురిగొల్పిన తీరును ప్రతీ ప్రజాస్వామ్యవాది ఖండించాలి. శ్రీమతి కామాక్షి, ఆమె కుమారుడు మురళీకృష్ణ తమ స్థలం కోసం వైసీపీ నాయకులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసు కొంటున్నామని సెల్ఫీ వీడియో తీసికొని మరణించారు. సెల్ఫీ వీడియో తీసుకొన్నాగాని పోలీసులు సదరు నాయకులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలిగిస్తోంది. పోలీసు శాఖపై అధికార పార్టీ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళీకృష్ణకు మెరుగైన వైద్యం అందించాలి. పేదలకు ఇళ్ళు కట్టించరుగానీ, వైసీపీ వాళ్ళ వ్యాపారాల కోసం పేదల గుడిసెలు ధ్వంసం చేయడం, కాదంటే కక్ష సాధించడం ఈ ప్రభుత్వం దౌర్జన్యపూరిత ధోరణిని వెల్లడిస్తోంది. కోటిపల్లి కామాక్షి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఆ కుటుంబానికి జనసేన పార్టీ సానుభూతి తెలియచేస్తోంది. వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటుందని మనోహర్ అన్నారు.

కొత్త ఎల్లవరం ఘటనకు బాధ్యుడిపై ఏం చర్యలు లేవా?

మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేదు. వేధించేది వైసీపీ నాయకుడైతే కేసులు పెట్టేందుకూ పోలీసులు సంశయిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కొత్త ఎల్లవరం గ్రామంలో వైసీపీ నేత ఓ మహిళను వేధిస్తూ ఉండేవారు. ఆమె ఎదురు తిరిగినందుకు- ఆమె నివసించే పూరింటిని అధికారుల ద్వారా ధ్వంసం చేయించారు. ఈ తీరుని ప్రతి ఒక్కరూ ఖండించాలి అని నాదెండ్ల మనోహర్ కోరారు.

ఆ మహిళ తన ఆరేళ్ళ బిడ్డతో కలిసి గుడిలో తలదాచుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గంపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఈ ఘటనకు బాధ్యుడిపై ఇంత వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర మహిళా కమిషన్ ఏం చేస్తోంది? బాధితురాలికి భరోసా ఇవ్వాలని మా పార్టీ నాయకులకు ఇప్పటికే తెలియచేశాం అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

జగనన్న కాలనీలలో నిజమైన లబ్ధిదారులు మనమే అన్నా!