కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ చర్చ
ముఖ్యమంత్రి నివాసంలో కేంద్ర మంత్రికి విందు
ఏపీకి సంబంధించి అనేక కీలక ప్రాజెక్టులకు (జాతీయ రాజదారుల నిర్మాణానికి గాను) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆమోదం తెలిపారు. ఏపీ ప్రతిపాదనలకు (AP Proposals) కేంద్రం ఆమోదం తెలిపినందుకుగాను సీఎం జగన్ (CM Jagan) కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు (National Highways Projects) గడ్కరీ ప్రారంభోత్సవం చేశారు. అలానే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు (Foundation stone) చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చేరుకున్నారు.
కేంద్రమంత్రి గౌరవార్ధం సీఎం కేంద్రమంత్రికి విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్ గడ్కరీతో సీఎం చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు కూడా హాజరయ్యారు.
విశాఖపట్నం – భీమిలి – భోగాపురం (బీచ్ కారిడార్) రోడ్డుపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని, టూరిజం రంగం బాగుపడ్డమే కాకుండా చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం జగన్, కేంద్రమంత్రికి వివరించారు. త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి (International Airport) త్వరగా చేరుకోవాలన్నా ఈ రహదారి అత్యంత కీలకమని సీఎం కేంద్రమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేశారు.
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి ఇప్పుడు నిర్మాణం అవుతున్న పశ్చిమ బైపాస్తో పాటు తూర్పున మరో బైపాస్ నిర్మాణం కూడా చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదన చేశారు. సీఎం చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టును కూడా మంజూరుచేస్తున్నట్టుగా వెల్లడించారు. కృష్ణానదిపై బ్రిడ్జితోపాటు 40కి.మీ మేర బైపాస్ కూడా రానుందని తెలిపారు.
ఆర్ అండ్ బీ మంత్రి ఎం శంకరనారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శులతోపాటు రాష్ట్ర, రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎం.ఒ.ఆర్.టి.హెచ్. ఆర్వో ఎస్.కె.సింగ్, ఎన్ఏఐ అధికారులు మహబిర్ సింగ్, ఆర్.కె.సింగ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.