Pawan kalyan at Legal CellPawan kalyan at Legal Cell

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 సీట్లకే పరిమితం
రాజకీయ నిపుణుల అధ్యయనాలు… సర్వేలు
తదుపరి అసెంబ్లీలో జనసేన జెండా పాతుతాం
గెలుపే లక్ష్యంగా… తపన ఉన్న వ్యక్తులే మా అభ్యర్థులు
కప్పు కాఫీ, ముక్క పెసరట్టు కోసం ఆంధ్రప్రదేశ్ ఆస్తులు?
హైదరాబాద్ లో 300 ఎకరాల ఆస్తులు కాపాడుకోవడమే ముఖ్యమా?
శాంతిభద్రతల వ్యవస్థ దోపిడీలు, దొమ్మిలు చేసిన వారికి అనుకూలం
ఆస్తులను ఎడాపెడా వాడేసి, ఆర్థిక అల్లకల్లోలం సృష్టిస్తున్నారు
నాని ఫాల్కీవాలా.. బి.ఆర్. అంబేద్కర్ లు నా హీరోలు
జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో జనసేన అధినేత

జనసేన (Janasena) రోజురోజుకీ పంచుకొంటుంది. మరొక పక్కన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YCP) 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కాబోతోంది అని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. రాజకీయ నిపుణుల అధ్యయనాలు, సర్వే రిపోర్టులు ప్రకారం చూస్తే వైసీపీకి వచ్చే సీట్లు అవే అని జనసేనాని (Janasenani Sensational comments) అన్నారు.

పార్టీ పుంజుకొంటోందని తెలుపుతూ నాయకులు, శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ విభాగమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లీగల్ సెల్ (Janasena Party Legal Cell meeting) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ (Samba Siva Prathap) ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, నగర కమిటీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అన్నకు, చెల్లికి వచ్చిన సొంత తగాదాలు, ఆస్తి గొడవలు (Jagan family disputes) చక్కబెట్టు కొంటున్నారు. 300 ఎకరాల సొంత ఆస్తులను కాపాడుకునే విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. మరి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు సంబంధించిన వేలకోట్ల రూపాయలను తెలంగాణలో ఎందుకు వదిలేసారు..? కేవలం కప్పు కాఫీకి… పెసరట్టు ముక్కకీ రాష్ట్ర ప్రజల ఆస్తులు అప్పనంగా అప్పగించేశారు. సొంత ఆస్తులపై ఉన్న శ్రద్ధ మీకు ప్రజల ఆస్తులపై లేదు. వేలాది కోట్ల రూపాయల ఆంధ్ర ఆస్తులను ధారాదాత్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రితో (Telangana Chief Minister) మీరు వేసిన భేటీల్లో ప్రజల ఆస్తులను వదిలేసి రావడం వెనుక ఇదే అసలు అంతరార్థం అని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) కీలక ఆరోపణలు చేసారు.

అధ్యయనం, పోరాటం, నిర్మాణం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (B R Ambedkar) చెప్పిన మాటలు నాకు నిత్య స్పూరణ. అధ్యయనం, పోరాటం, నిర్మాణం అనే మూడు మాటలు నాకు పరిశీలకాలు. 2003 నుంచి రాష్ట్ర రాజకీయాలను, ప్రజా సమస్యలను నిత్యం అధ్యయనం చేశాం. 2014 నుంచి రాష్ట్రంలోని సమస్యలపై నిత్య పోరాటాలు చేసాం. ఉద్దానం సమస్య కానివ్వండి. రాజధాని రైతుల (Amaravati Farmers) సమస్య కానివ్వండి.. గళమెత్తి గట్టి పోరాటాలు చేసాం. ఇప్పుడు పార్టీ నిర్మాణం దశకు చేరుకున్నాం. వచ్చే ఎన్నికల్లో ఈ నిర్మాణ దశ నుంచి అధికారం చేపట్టే వరకు మన ప్రయత్నం బలంగా జరగాలి. అంతే బలంగా ముందుకు వెళ్ళాలి. “ది బోల్డ్ ఈజ్ మేజిక్ ” అన్నట్లు కేవలం ధైర్యమే కవచంగా బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళగాలిగా మన్నారు.

80వ దశకంలో ఎన్టీ రామారావు (N T Rama Rao) పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చిన పరిస్థితులు వేరు. అప్పటి సామాజిక పరిస్థితులు భిన్నం. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తితో పోల్చుకోలేం కానీ, పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చేయాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అందుకే నేను మొదటి నుంచి 25 సంవత్సరాలు నాకు ఇవ్వండి అని బలంగా కోరుకున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అణగారిన వర్గాలకు కచ్చితంగా రాజ్యాధికారం (Rajyadhikaram for suppressed)

వుయ్ ది నేషన్ పుస్తకంలో పద్మ విభూషణ్ నానీ ఫాల్కీవాలా చెప్పినట్లు లా ఈస్ క్రూడీఫై ధర్మ అన్న మాట చాలా గొప్పది. అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్లు సమాజంలో అణగారిన వర్గాలకు కచ్చితంగా రాజ్యాధికారం అవసరం అనేది నమ్మతాను. ఒక జనరేషన్ మార్పు, భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొన్న మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన పడిన కష్టాలు, అవమానాలు అవహేళనల నుంచి వచ్చిన గొప్ప కార్యశక్తి తాలూకా వెలుగులు ఇప్పుడు జాతికి దారి చూపుతున్నాయి.

ఒక జనరేషన్ కోసం కష్టపడితే కచ్చితంగా మార్పు సాధ్యమే. కష్టాల్లో ఉన్న సాటి మనిషి తాలూకా ఇబ్బందులు నన్ను సమాజ నిత్య పరిశీలకుడిగా మార్చింది. అందుకే నేను  నాని ఫాల్కీవాలాని (Nani Palkiwala), బీఆర్ అంబేద్కర్’ని హీరోలుగా భావిస్తాను అని జనసేనాని తెలిపారు.

ఉత్పత్తి కులాలకు రాజ్యాధికారం కోసమే జనసేన

1964లో రామ్ మనోహర్ లోహియా (Ram Manohar Lohia) గారు రాసిన పుస్తకంలో ఉత్పత్తి కులాలకు రాజ్యాధికారం (Rajyadhikaram) అవసరం అని చెప్పారు. కొద్దిమంది వద్ద రాజ్యాధికారం ఎందుకు ఉండిపోయింది అని ప్రశ్నించిన పుస్తకం. ఉత్పత్తి కులాలకు సమాజంలోని కష్టాలు, నష్టాలు, సమస్యలు అన్నీ తెలుస్తాయి. కానీ వాటిని పరిష్కరించుకోవలసిన అధికారం మాత్రం వారికి ఉండదు. 2009లో కచ్చితంగా ఈ వర్గాలకు అధికారం కోసం మార్పు జరుగుతుందని ఆశించాం. కానీ అప్పట్లో కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాలేదు. మళ్లీ అలాంటి తప్పు జరగదు. కచ్చితంగా ఉత్పత్తి కులాలకు అధికారం అందాలి అనే సంకల్పంతోనే పార్టీ పెట్టాను.

చెట్టు మీద పక్షులు ఎగిరిపోయినా చెట్టు అలాగే ఉంటుంది

2019లో ఓటమిపాలైన సమయంలో చాలామంది పార్టీ వదిలి వెళ్ళిపోతాడు.. కుంగిపోతాడు అనుకున్నారు. కానీ నేను బలమైన వృక్షం. నా మీద వాలే పక్షులు వెళ్ళిపోయినా నేను బలంగా నాటుకుని నీడను ఇస్తాను. 2019 ఎన్నికల్లో ఓటమిపై టీవీల్లో వార్తలు వస్తున్న సమయంలో నాకిష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం (Maha Bharatam) చదివాను. అందులో ఒక చోట ‘చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టు ముట్టినా, గ్రీష్మ రుతువులు మంట పుట్టించినా అది నేలకే అంకితమై ఉంటుంది. వేర్లను బలంగా విస్తరించి తన ఉనికిని చాటుతుంది’ అనే పంక్తులు కనిపించాయి.

సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటి పెట్టుకున్న కోట్ల మంది ప్రజల్లాగా నేను కూడా నా పార్టీని, నేలను, దేశాన్ని, సమాజాన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను జీవితంలో చేసిన అతి గొప్ప పని, మంచి పని రాజకీయాల్లోకి రావడమే. దెబ్బలు తినడం, అవమానాలు పడడం నాకు కొత్త కాదు. పడతాం.. లేస్తాం కచ్చితంగా సాధిస్తాం. చెట్టు మీద పక్షుల్లా పార్టీలోంచి వ్యక్తులు వెళ్ళిపోయినా పార్టీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను నిలబడే ఉంటాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

2014లో తెలుగు దేశం పార్టీకి (Telugudesam Party) మద్దతు ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉంది. విభజన తర్వాత వచ్చిన ఇబ్బందులను అధిగమించాలని, చాలామందితో చర్చించిన తర్వాత పెద్దలు సూచనలు మేరకు మాత్రమే టీడీపీకి మద్దతు ఇచ్చాం. 2019లోనూ బలమైన పోరాట పంథాలోకి మారాం.

అమరావతిపై (Amaravati) వైసీపీ చట్ట సభల్లో మాట ఇచ్చింది

రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి అమరావతిపై వైసీపీ ఆడుతున్న ద్వంద వైఖరి ప్రజలు గుర్తించాలి. చట్టసభల్లో బేషరతుగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. అప్పట్లో జనసేన పార్టీ రాజధానిని విస్తరించుకుంటూ పోవాలని, ఒకేసారి 35 వేల ఎకరాల్లో అభివృద్ధి అసాధ్యమని చెప్పింది. కానీ వైసీపీ మాత్రం అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత సైతం ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. ప్రజలను పూర్తిస్థాయిలో నమ్మించారు. ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ నానా హడావుడి చేస్తోంది. మరి మీకు అప్పట్లోనే మూడు రాజధానులు చేయాలని ఆకాంక్ష ఉంటే, చట్టసభల సాక్షిగా ఎందుకు ప్రజలను మభ్య పెట్టారో సమాధానం చెప్పాలి.

సుగాలి ప్రీతీ తల్లి ధైర్యాన్ని చూసి సలాం చేయాలి!

సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం విన్నప్పుడు అసెంబ్లీలో పోరాడే మా పార్టీ ఎమ్మెల్యే లు లేరన్న విషయం బాధ పెట్టింది. ఒక రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే బాలిక తల్లి పార్వతి వచ్చి కలిశారు. తన బిడ్డ స్కూల్’కి వెళితే అక్కడ మానభంగం చేసి చంపేశారని తన బాధను, ఆక్రోశాన్ని వెలిబుచ్చింది. తన బిడ్డలా ఎవరికి కాకూడదంటూ, ఆ తల్లి వేదన నిండిన కళ్ళతో సీఆర్పీసీ సెక్షన్లతో సహా చెబుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ‘మీరు లాయరా అమ్మ’ అని అడిగితే, నా బిడ్డకు జరిగిన అన్యాయం తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను అని చెబితే నాకు ఆ అమ్మ ధైర్యానికి సలాం చేయాలి అనిపించింది. దాని తర్వాత కర్నూలు నగరంలో ఆ తల్లికి మద్దతుగా పోరాటం చేశాం.

అనంతరం ఈ ప్రభుత్వం ఆ కేసును సీబీఐకు (CBI) ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు. అలాంటి సమయంలో అసెంబ్లీలో బలంగా పోరాడే మా పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే బాగుండు అనిపించింది. చట్టసభల సాక్షిగా ఆ తల్లికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిసేలా, సభల్లో చర్చించేవాళ్ళం అనిపించింది. అలాగే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో వికలాంగులు పడుతున్న బాధలు, గాధలు విన్న గుండె చలించిపోతుంది అంటూ పవన్ కళ్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేసారు.

మనిషి ఉదాసీనత నైతికంగా చంపేస్తుంది

కశ్యప మహాముని ఒక మాట అంటారు.. నేరం జరిగితే సగం శిక్ష చేసిన వాడికి, పావు వంతు సహకరించిన వాడికి, మిగిలిన పావు భాగం ఆ నేరం జరుగుతున్నప్పుడు కనీసం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని వాడికి వేయాలి అంటారు. దాదాపు ఇదే మాటలు ఎడ్మిన్ బర్గ్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లు చెబుతారు. కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే మనకు ఎందుకు అన్న ఉదాసీనత మనిషిని నైతికంగా చంపేస్తుంది.

ఎవరో వస్తారు ఏదో చేస్తారో మనకు ఎందుకు అనే ఉదాసీనత సమాజంలో ఉండే మానవత్వాన్ని చంపేస్తుంది. వాళ్లకు నష్టం జరిగింది మనకి కాదు అనుకునే ఆలోచన వల్ల నీకు కచ్చితంగా ఏదో ఒక రోజు నష్టం జరుగుతుంది. ఎదురింటి వరకు వచ్చిన కష్టం నీకెందుకు రాదు..? ఇది కచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. దొమ్మిలు, దోపిడీలు చేసిన వారు రాజ్యాన్ని ఏలుతుంటే, హత్యలు, అఘాయిత్యాలు చేసే వారిని రక్షించక ఏం చేస్తారు?

ఒక మహిళకు మానానికి భంగం వాటిల్లితే ఈ రాష్ట్ర హోంమంత్రి నిందితులను వెనకేసుకు వచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరం చేసిన వారు మానభంగం చేయడానికి రాలేదని దొంగతనం చేయడానికి వచ్చారని పొరపాటున మానభంగం జరిగిందని చెప్పడం ఈ పాలకులు ప్రజల్ని ఎంత బాగా పాలిస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

మెజారిటీ ప్రజల నిర్ణయమే సరైంది అని నమ్మకం ఏంటీ?

నాని ఫాల్కీవాలా చెప్పినట్లు భారీ మెజారిటీతో ప్రజలు ఒకరిని అందలం ఎక్కిస్తే ఆ నిర్ణయం సరైంది అని నమ్మడానికి లేదు. మెజారిటీ ప్రజలే నిజం అని నమ్మడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అలాగే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఇచ్చిన నిర్ణయం సరైంది అని ఎలా చెబుతాం. 2019లో వివిధ కారణాల రీత్యా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించిన పాపానికి వారు ఇప్పుడు బాధపడుతున్నారు. మెజారిటీ ప్రజల నిర్ణయమే సరైంది అయితే జీసస్ కి శిలువ వేయరు.. అలాగే సోక్రటీస్ ను విషం పెట్టి చంపరు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టే సమయం రాసుకుని వస్తాడు అంటారు. అది వ్యక్తి అయిన, అధికారమైనా గిట్టే సమయం వస్తే తప్పదు. దీనిని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి అంటూ జనసేనాని హెచ్చరించారు.

నిధులన్నీ దారి మళ్లించిన వైసీపీ ప్రభుత్వం

ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు సమయంలో నాని ఫాల్కీవాలా అన్న మాటలు సందర్భోచితం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పటేల్ దేశంలోని సంస్థానాలను కలిపినప్పుడు వారికి రాజభరణాలను ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు సమయంలో ఫాల్కీవాలా మాత్రం చట్టసభల్లో పాలకులు ఇచ్చిన మాటలకూ సరైన రీతిలో సమాధానం లేకపోతే భవిష్యత్తులో కొత్త సమస్యలు వస్తాయని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించి రూ.450 కోట్లు దారి మళ్లించారు. అలానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రూ.400 కోట్లు, గత ప్రభుత్వం లో ఎల్ఐసీ దగ్గర ఉన్న అభయహస్తం సొమ్ములు రూ. రెండు వేల కోట్లు దారి మళ్లించారు. అలానే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వద్ద ఉన్న రూ.1100 కోట్లు, పంచాయతీలకు చెందాల్సిన నిధులను దారి మళ్ళించింది. ఈ నిధులను దారి మళ్లించే అధికారం మీకు ఎవరిచ్చారు. ఆర్థికంగా క్రమశిక్షణ లేక, ఇష్టానుసారం నిధులను దారి మళ్ళించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి చూస్తుంటే దోపిడీలు, దొమ్మిలు చేసే వారికే బాగుంది. ఎన్నికల ముందు విశాఖలో కోడి కత్తితో దాడి జరిగితే కనీసం నిందితుడికి ఇప్పటి వరకు శిక్ష పడలేదు. అదే జనసైనికులు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, ఎమ్మెల్యేని అడిగితే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇదే మీకు తెలిసిన న్యాయం అంటూ సేనాని ఆవేదన వ్యక్తం చేసారు.

పార్టీ శ్రేణులకు లీగల్ విభాగం దన్ను అవసరం

సోషల్ మీడియాలో (Social Media) పోస్టులు పెట్టిన, గడపగడపకు వస్తున్న ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన కేసులుపెడుతున్నారు. వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మిలిటెంట్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలి. అంటే ఆయుధాలు అక్కర్లేదు.. మాటే ఆయుధం. దానికి జనసేన పార్టీ లీగల్ విభాగం దన్నుగా నిలబడాలి. జన సైనికులకు న్యాయపరమైన అంశాల్లో సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. వారికి న్యాయపరమైన సెక్షన్ల మీద పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఎలా నిలువరించాలి అన్నదాని మీద ఖచ్చితంగా విభాగం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది.

వీర మహిళల మీద కూడా ఫోన్లో ఇష్టానుసారం వేధింపులు ఎక్కువవుతున్నాయి. వీటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు చట్టాలను ఉపయోగించుకుని ముందుకు వెళ్లేందుకు జనసేన లీగల్ విభాగం కొత్త గా ఒక కార్యక్రమం రూపొందిస్తే బాగుంటుంది. ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి..? పోలీసులు అక్రమ కేసులు పెడితే దానిని న్యాయబద్ధంగా ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలను జనసైనికులకు చెప్పడానికి ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించి కార్యక్రమాలు రూపొందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ లీగల్ సెల్’కి సూచించారు.

ప్రజలను నమ్ముకున్నాం

జనసేన పార్టీ ప్రజల్ని నమ్ముకుంది. నేను రోడ్డు మీదకు వస్తే లక్షలాదిమంది జనం వస్తారని నాయకులు చెబుతుంటారు. అది నిజమే కానీ దానిని పాల పొంగులా భావిస్తాను. మనకోసం నడిచి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. వారిని ఓటర్లుగా మార్చాలి. గత నెలన్నర రోజులుగా ఎంతోమంది మేధావులను, పార్టీ సానుభూతిపరులను, పెద్దలను కలిసి అనేక విషయాల్లో చర్చించాం.

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలం పుంజుకోవడానికి మనమేం చేయబోతున్నాం అన్నది ఇప్పుడు చాలా కీలకం. మన సన్నద్ధత ఏంటి… పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది నాయకులు ఆలోచించాలి. చాలామంది మేధావులు చెప్పిన మాటలు ప్రకారం జనసేన పార్టీకి భారీగా ఆదరణ పెరుగుతోంది. కచ్చితంగా ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. వారికి మరింత చేరువ కావడం ఎలా అన్నదానిని నాతో పాటు, పార్టీ నాయకులు కూడా ఆలోచించి ముందుకు వెళ్దాం. రాకెట్ ప్రయోగించే ముందు కూడా దానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, కక్ష ఉంటాయి. జనసేన పార్టీ కూడా అది నమ్ముతుంది అని పవన్ కళ్యాణ్ వివరించారు.

యాత్ర కచ్చితంగా ఉంటుంది

అక్టోబర్ నెలలో మొదలు కావల్సిన యాత్ర (Pawan bus yatra) కాస్త ఆలస్యం అయినప్పటికీ కచ్చితంగా యాత్ర ఉంటుంది. అక్టోబర్ నెలలో ప్రతి నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఉంటాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అది మొదలుపెడతాం. వచ్చే ఎన్నికల్లో తపన, తృష్ణ ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపుతాం. రాజకీయాలు అంటే ఒక తపనతో ప్రజల కోసం ఏదైనా చేయాలి అనే గట్టి ఆలోచన ఉన్న నాయకులను పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబెడతాం. ప్రతి నియోజకవర్గంలోనూ బలాలు పెంచుకొని గెలుపే లక్ష్యంగా ఈ సారి పార్టీ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తాం. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే మొదటి లక్ష్యం గా ముందుకు వెళ్లేందుకు జనసేన పార్టీ బలమైన ప్రయాణం ఇప్పటికే మొదలైంది. ప్రజల కోసం బలమైన మార్పును కోరుకునే జనసేన వైపు ప్రజలు కచ్చితంగా ఒకసారి ఆలోచించి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పచ్ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ (వీడియో సందేశం) లీగల్ సెల్ ఛైర్మెన్ సాంబశివ ప్రతాప్, పార్టీ పి.ఏ.సి. సభ్యులు ముత్తా శశిధర్… రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, చిలకం మధుసూదన్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ప్రభృతులు ప్రసంగించారు.

రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే
అమరావతిపై సుప్రీంకోర్టుకి ఏపీ సర్కారు