Pawan kalyanPawan kalyan

చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు

జనసేన పార్టీ (Janasena Party) అధికారంలోకి వస్తే అల్లూరి సీతారామ రాజు (Alluri Sitarama Raju) లాంటి స్వాతంత్ర సమరయోధులు కలిగించిన స్ఫూర్తికి తగిన గుర్తింపు వచ్చేటట్లు చూస్తుంది. అటువంటి వారి జయంతిలను, వర్దంతిలను అధికారికంగా జరిగేటట్లు జనసేన ప్రభుత్వం (Janasena Government) చూస్తుందని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసారు.

వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారు. దాస్య శృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన శ్రీ సీతారామరాజు, ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారు. శ్రీ సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు చెరగులకూ విదితమే.

అల్లూరి సీతారామరాజుకి భారతరత్న ప్రకటించాలి

నేటి తరం దేశవాసులందరికీ శ్రీ అల్లూరి సీతారామరాజు సంకల్పం.. పోరాట పటిమ.. ధీరత్వం.. మృత్యువుకు వెరవని ధైర్యం.. జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. భారత రత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలి. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఆయన స్ఫూర్తిని దేశమంతటికీ చాటాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను జనసేన ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఆ చైతన్యమూర్తి వర్ధంతి సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏపీలో స్వర్ణయుగం: నాగబాబు