Chandrababu at MahanaduChandrababu at Mahanadu

కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్న బాబు ప్రసంగం
వివేకా హత్యపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
క్రమశిక్షణతో సాగుతోన్న మహానాడు
చెమటోడ్చి పనిచేసిన తెలుగు దేశం కార్యకర్తలు
గోదావరి వంటకాల రుచులతో అందరికీ చక్కటి ఆతిథ్యం

తెలుగుదేశం పార్టీ మహానాడు రాజముండ్రిలో అంగరంగ వైభవంగా మొదలు అయింది. ఉభయ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడుకి తరలి వచ్చారు.  ఆనందోత్సాహాలతో మహానాడు బ్రహ్మాండంగా ప్రారంభం అయ్యింది.

దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీలలో కానరాని క్రమశిక్షణ, నిబద్ధత మా ఈ మహానాడులో కనిపిస్తున్నది అని తెలుగుదేశం చెప్పుకొంటున్నది. మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభకు 15 వేలమంది వస్తారని అంచనా. అయితే అంతకు మూడు, నాలుగు రెట్లు అధికంగా ప్రతినిధులు హాజరు అయ్యారు అని తెలుగుదేశం నాయకులూ చెబుతున్నారు.

పలు తీర్మానాలకు ఆమోదం

ఈ మహానాడులో తొలిరోజు తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలపై నాయకులు చర్చించి ఆమోదించారు. మహానాడు తీర్మానాలపై చర్చించేందుకు అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించారు. సభావేదిక సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్య నాయకులూ చెబుతున్నారు. తొలుత పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు వేదిక అంతా కలియ దిరిగి అందరినీ పలకరించారు. ప్రతినిధుల సభకు హాజరైన వేలాదిమంది కార్యకర్తలకు అభివాదం చేశారు.

ఎండలు తీవ్రంగా వున్నప్పటికీ సభాప్రాంగణం లోపల వున్న వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్ లు నిరంతరం, త్రాగునీరు, మజ్జిగ అందజేశారు. నోరూరించే గోదావరి వంటకాల రుచులు అందరినీ అలరించాయి. మహానాడు సభా ప్రాంగణంలో దాదాపు 50 వేలమందికి పైగా భోజనాలు సిద్ధం చేశారు. వేలాదిమంది కార్యకర్తలకు టిడిపి ఇచ్చిన ఆతిథ్యం మహానాడుకు మరింత వన్నె తెచ్చింది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకున్నది.

ప్రతినిధుల నమోదు కార్యక్రమం

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్కడి రిజిష్టర్’లో సంతకం చేయటంతో ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు పార్లమెంటరీ కమిటీ కౌంటర్’లో ప్రతినిధిగా నమోదు చేసుకున్నారు. అనంతరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల నమోదు కార్యక్రమం పూర్తయింది.

ప్రతినిధుల సభలో తొలుత మా తెలుగుతల్లికి మల్లెపూదండ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ అధినేత చంద్రబాబు తొలుత తన ప్రసంగంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ లు లాంటి ముఖ్యులు ప్రసంగించారు. ముందుగా అజెండాలో పొందుపరచిన విధంగా వివిధ నాయకులు పలు అంశాలపై ప్రసంగాలు చేశారు.

వివేకా హత్యపై జగన్ స్పందించాలి

వివేకా హత్యకేసులో అసలు దోషి జగనే అని సిబిఐ అఫిడవిట్’తో తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. వివేకాను హత్యచేసి ఊసరవెల్లిని మించి వేషాలు వేశారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటివరకు వివేకా హత్యలో రోజుకో మాయ మాట చెప్పారని తేలిపోయిందన్నారు.

హత్య కేసులో ప్రధాన నిందితుడు జగన్ మోహన్ రెడ్డే అని సిబిఐ పేర్కొంది. హత్యకు సంబంధించి ప్రతి ఉదంతం జగన్ కు తెలిసే జరిగింది అని కూడా సిబిఐ చెప్పిందని, వీటన్నింటికి, పరిణామాలకు జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాబు మరోసారి ఎన్నిక

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు 14వ సారి కూడా ఎన్నికయ్యారు. మహానాడులో శనివారం తెదేపా అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. ఎన్నిక వివరాలను ఎన్నికల నిర్వహణ కమిటీ తరఫున కాలవ శ్రీనివాసులు రాత్రి ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీనివాసులు ప్రకటించారు. తర్వాత ఎన్నికల కమిటీ తరఫున డిక్లరేషన్‌ పత్రాన్ని చంద్రబాబుకు అప్పగించారు.

గాల్లో పోయేవాడికేమి తెలుసు భూమి మీద ఉన్నోడి కష్టాలు: సేనాని కార్టూన్